హైదరాబాద్ : ఈ నెల 29 న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పమంత్రులు తలసాని, మహమూద్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని పండుగలను సమానంగా చూస్తున్నారన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో పండుగలను నిర్వహిస్తున్నామన్నారు.
ఇఫ్తార్ విందుకు వచ్చే ప్రతినిధులకు ప్రత్యేక పాస్ లను జారీ చేశామన్నారు. రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు ప్రభుత్వం తరపున దుస్తులను పంపిణీ చేస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు ఉంటాయన్నారు. సీఎం కేసీఆర్ హాజరయ్యే ఇఫ్తార్ విందు సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాల ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.