జోగులాంబ గద్వాల : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జోగులాంబ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. మంత్రికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరిపైనా అమ్మదీవెనలు ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. స్వరాష్ట్రంలో కృష్ణ పుష్కరాలను జోగులాంబ సన్నిధిలో ఘనంగా నిర్వహించామన్నారు. జోగుళాంబ దేవస్థానంలో ప్రసాద్ పథకం ద్వారా భక్తుల సౌకర్యాల నిమిత్తం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, ఇతర స్థానిక ప్రజాప్రతినిదులు, అధికారులు ఉన్నారు.