నిర్మల్: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రభుత్వం అభివృద్ధి చేసిందని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్లోని (Nirmal) ఎంసీహెచ్లో నిర్వహించిన ఆరోగ్య దినోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డాక్టర్లు, ఆశా వర్కర్లు, వైద్య బృందాలు, ప్రొఫెసర్లకు తెలిపారు. అనంతరం దవాఖానలో బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేశారు. రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా.. వైద్య రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు.
అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తేవడంతో పాటు వివిధ రకాల వైద్య పరీక్షలను కూడా ఉచితంగా అందజేస్తున్నామని వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని ఏంసీహెచ్ను 80 పడకలకు అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. జిల్లా ఆసుపత్రితోపాటు ఇతర దవాఖానాల్లో మొత్తం 450 పడకలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.