నిర్మల్: స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేద్కర్ (Ambedkar) చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీట్యాంక్ బండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడని, కుల, మత రహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారన్నారు.
దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు ఆయన చేసిన పోరాటం మరువలేనిదని తెలిపారు. ఆయన ఖ్యాతిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించనుందని, ఇది దేశంలోని అతి ఎత్తయిన స్మారక చిహ్నంగా నిలవనుందని పేర్కొన్నారు