నిర్మల్ : రాష్ట్రంలో విద్యా రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ ముందజలో ఉందని అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్ రూరల్ మండలం అనంతపేట్ గ్రామంలో రూ.3.80 కోట్లతో నిర్మించిన కేజీబీవీ బాలికల పాఠశాల భవనాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు.
కేజీబీవీ ఏర్పాటు చేయడంతో పేద విద్యార్థినులకు మెరుగైన విద్య అందుతుందని పేర్కొన్నారు. పాఠశాలలో ఆధునిక వసతులతో రూ.3.80 కోట్లతో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కేజీ టు పీజీ అమలులో భాగంగా ప్రభుత్వం కేజీబీవీలను ప్రారంభించి బాలికలకు మెరుగైన విద్యనందిస్తుందని తెలపారు. సకల సౌకర్యాలతో భవన నిర్మాణం చేపడుతుండడంతో విద్యార్థినుల, ఉపాధ్యాయుల సమస్యలు తొలగిపోనున్నాయి.