Minister Indrakaran Reddy | బీజేపీది డబుల్ ఇంజిన్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ సర్కారు అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సెటైర్లు వేశారు. ఆదిలాబాద్ పర్యటనలో కేంద్రమంత్రి చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి కర్రు కాల్చివాత పెట్టడం ఖాయమన్నారు. కారు స్టీరింగ్ కేసీఆర్ చేతుల్లో పదిలంగా ఉందని, బీజేపీ స్టీరింగే అదానీలాంటి కార్పొరేట్ల చేతుల్లో ఉందన్నారు.
బీజేపోళ్ల మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అమిత్ షా తెలంగాణ ఎప్పుడొచ్చినా అడ్డగోలు విమర్శలు చేయడమే తప్ప.. తెలంగాణ అభివృద్ధిపై ఆయనకు కొంచమైనా అవగాహన ఉందా? అంటూ ప్రశ్నించారు. ఇక్కడ ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో ఆయనకు తెలుసా..? అంటూ నిలదీశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. రైతు ఆత్మహత్యలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆదివాసీల సంక్షేమంపై మాట్లాడే అర్హత అమిత్షా లేదన్నారు.
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయహోదా, ఆదిలాబాద్లో సీసీఐ పునరుద్ధరణ పై ఎందుకు మాట్లాడలేదని ఇంద్రకరణ్రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చినవారు ఒక విజన్తో మాట్లాడాలని హితవు పలికారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తమ హక్కు అని, రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఇచ్చింది ఏమీ లేదన్నారు. అమిత్ షా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.