నిర్మల్, జూలై 20 : వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రైతాంగం, ప్రజలు కనెర్ర చేస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. 24 గంటల కరెంటుపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు నిరసనగా గురువారం సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతుల సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.
ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ చాలు అంటాడు. అసలు ఆయనకు వ్యవసాయం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రైతు ఎన్ని గంటలు నీరు పారిస్తే ఎన్ని ఎకరాలకు నీరు పారుతుందో రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదు. కాంగ్రెస్ నాయకులు ఊర్లలోకి వస్తే తరిమికొట్టడానికి సిద్దంగా ఉన్నారన్నారు.
తెలంగాణ రాక మునుపు కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక ఎన్ని తిప్పలు పడ్డామో మనకు తెలుసు. వ్యవసాయానికి రాత్రిపూట మాత్రమే కరెంట్ ఇస్తుండే. రాత్రంతా జాగరం చేస్తూ రైతులు తేళ్లు, పాము కాటుకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలనలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. ఎంత అవస్థ పడ్డామో అందరికీ తెలుసు. ఇవ్వాళ ఆ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయా? అని ప్రశ్నించారు. రైతులు ఎప్పుడంటే అప్పడు స్టాటర్ ఆన్ చేసుకుని, నీళ్లు పారించుకునే పరిస్థితులను సీఎం కేసీఆర్ కల్పించారని పేర్కొన్నారు.
వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ చాలు అన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రజలు, రైతులు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించేలా ఆపార్టీకే ఓటు వేయాలని కోరారు. ఆనంతరం రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని, మూడు గంటలు వద్దు మూడు పంటలు కావాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించారు.