నిర్మల్ : ప్రత్యేక తెలంగాణ కావాలి, రావాలి అని తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు 108వ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన ప్రాంత బిడ్డల త్యాగాలను మనందరం గుర్తు చేసుకొని వారి అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు.
తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ భాష, సాహిత్యానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ నిర్మాత సీఎం కేసీఆర్కు కాళోజీ రచనలు, కవిత్వం అంటే ఎంతో అభిమానమని చెప్పారు.
సమాజంలో జరుగుతున్న, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపైన ఆయన కవితల ద్వారా చైతన్య వంతులను చేశారని, అయన స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.