నిర్మల్ : ఆదివాసీల హక్కులు, సంస్కతి సంప్రదాయాల పరిరక్షణ, స్వయం పాలనకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు. వారి పోరాటాలకు గుర్తుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బుధవారం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఆదివాసీ ఆత్మగౌరవ పోరాట యోధులు కుమ్రం భీం, గోండు వీరుడు రాంజీ గోండు విగ్రహాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉమ్మడి పాలనలో గిరిజన గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేక చీకటిలో మగ్గుతూ నివసించడానికి స్థలాలు, పక్కా గృహాలు లేక పూరిగుడిసెల్లో, పౌష్టికాహారం లేక, చదువుకు, సంపదకు ఆహారానికి, ఆరోగ్యానికి నోచుకోలేక జీవనం కొనసాగించే వారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. వారి కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు 1.52 లక్షల మంది అడవి బిడ్డల కోసం పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాల భూమిని 37 వేల కుటుంబాలకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివాసీల గూడేలు, గిరిజన తండాలను జీపీలుగా ఏర్పాటు చేసి.. ‘మావ నాటే మావ రాజ్.. మా తాండాలో మా రాజ్యం’ అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను సీఎం కేసీఆర్ నెరవేర్చారన్నారు.