నిర్మల్ : ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిందని..మత్స్య సంపద పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం స్వర్ణ ప్రాజెక్ట్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని, కుల వృత్తులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
చేప పిల్లల పెంపకం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. ఇందులో భాగంగా చేప పిల్లలను చెరువులో వదిలామన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. చేపలను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సహాయపడుతుందని వైద్యులు సూచిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.