వేములవాడ: వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఆధ్వర్యంలో పేదల దేవుడు వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ (Rajanna temple) అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని, భక్తుల మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు. ఇప్పటికే రూ.100 కోట్లు వెచ్చించి చేపట్టిన భూసేకరణ, ఇతరత్రా అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని కోనరావు పేట (Konaraopet) మండలం నాగరాంలో రూ.36 లక్షలతో పునర్నిర్మించనున్న కోదండ రామాలయ విగ్రహా ప్రతిష్ట, ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పాల్గొన్నారు.
అంతకుముందు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు పాలకమండళ్లను నియమించామని తెలిపారు. మిగిలిన ఆలయాల పాలక మండళ్ళ నియామకంపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భగవంతులని ఆశీస్సుల వల్ల సకాలంలో సంవృద్ధిగా వానలు కురుస్తున్నాయని, పంటలు పుష్కలంగా పండుతున్నాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ కృషితో సాగునీటి కష్టాలు తీరాయని, రైతులు ఎంతో మేలు జరిగిందన్నారు.