నిర్మల్: రైతుల పట్ల కేంద్ర వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కేంద్ర రైతు వ్యతిరేఖవిధానాలపై రైతులు, సామాన్య ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. కల్లాల నిర్మాణం పూర్తయ్యాక, వ్యవసాయ కల్లాలకు ఉపాధి హమీ నిధులు ఇవ్వమని చెప్పడం సరికాదని, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులకు నష్టం చేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేఖిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతన్నల కోసం సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కేంద్రం అవలంభిస్తున్న రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేఖ విధానాలకు నిరసనగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో చేపట్టే ధర్నా కార్యక్రమాల్లో రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తులన పాల్గొని జయప్రదం చేయాలన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో నిర్వహించే ధర్నాలో స్వయంగా తాను కూడా పాల్గొంటానని వెల్లడించారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ రైతాంగానికి, సామాన్య ప్రజానికి తీవ్ర నష్టం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ.. వివక్ష చూపుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. జాతీయ ఉపాధి హమీ పథకం కింద నిర్మించిన కల్లాలకు నిధులు ఇవ్వకుండా మోకాలడ్డుతుందని కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రైతులకు ప్రత్యక్షంగా ఉపయోగపడే కల్లాలు వ్యవసాయంలో భాగంకాదని వక్రభాష్యాలు చెప్పి రైతన్నలను, వ్యవసాయ కూలీల పొట్టకొడుతుందని మండిపడ్డారు.
రైతన్నలు ఆర్థికంగా బలోపేతం కావాలని సీయం కేసీఆర్ ఎన్నో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలోనే అతిపెద్దదైన వ్యవసాయాన్ని రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను ఆదుకునేలా కేంద్రానికి ఒక విధానమే లేదని విమర్శించారు.