నిర్మల్: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రూపురేఖలు మారిపోయాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ.. తెలంగాణకు చేసిందేమీలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ మున్సిపాటిలోని రాంబాగ్, నాయుడివాడలో పర్యటించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల పరిష్కారం, పురోగతిపై ఆరా తీశారు. అభివృద్ధి పనులతోపాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కొత్త జిల్లాతో పాటు జిల్లా కోర్టులను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
అభివృద్ధితోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయని, వాటిని సకాలంలో అర్హులైన వారందరికీ అందేలా చూసే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. పల్లె, పట్టణాల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో అందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధుల భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రకృతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, కొన్ని వార్డుల్లో అనుకున్న స్థాయిలో పనులు జరగడం లేదని, అధికారులు అలసత్వం వీడాలన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి జరిగిన ఆభివృద్ధిని చూస్తే ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్నారని, అది చూసి ఓర్వలేకే కేంద్రం.. తెలంగాణపై వివక్ష చూపుతుందని చెప్పారు. మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం ప్రభుత్వం కేటాయించడం లేదన్నారు. పన్నుల రూపంలో మన పైసలు కేంద్రం తీసుకుపోతుందే తప్పా.. కేంద్రం మనకు నిధులు ఇచ్చింది లేదని స్పష్టంచేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలతో, ఆ పార్టీ నేతలతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని మండిపడ్డారు.