హైదరాబాద్: ప్రధాని మోదీ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతున్నందుకే బీజేపీ నేతలు దాడులకు దిగుతున్నారని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడి దారుణమని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఓ మహిళా నాయకురాలి ఇంటిపై దౌర్జన్యం చేయడం విచారకరమని, ఇదేనా బీజేపీ సంస్కారం అని నిలదీశారు.
సమస్యలను లేవదీస్తే గూండాగిరి చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ రౌడీ రాజకీయాలు మానుకోవాలని, ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పచ్చని తెలంగాణలో అగ్గిరాజేసే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు. బీజేపీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని, ప్రజాస్వామ్య విలువలను పాటించే ప్రతి ఒక్కరూ ఈ దాడిని గర్హించాలని కోరారు.