నిర్మల్ : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బాలికల విద్య కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల ఆడబిడ్డల వివాహాలకు ఇబ్బంది కలగకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా 1,00,116 రూపాయలను అందజేస్తున్నా మని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో నిలిపారని కొనియాడారు. నిర్మల్ మండలానికి చెందిన 94, దిలావర్ పూర్ మండలానికి చెందిన 56, సోన్ మండలానికి చెందిన 49 , సారంగాపూర్ మండలానికి చెందిన 36, మామాడ మండలానికి చెందిన 24 మందికి మొత్తం 278 మందికి చెక్కులను పంపిణీ చేశారు.