నిర్మల్: రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కొట్లాడుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) అన్నారు. బాజాప్తా వరి వేయండని, మీ వడ్లను మేం కొనిపిస్తామన్న బీజేపీ నాయకులు తీరా పంట చేతికి వచ్చాకా మోహం చాటేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పండిన పంటను మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నాగపూర్ జాతీయ రహదారిపై రైతులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. రైతుల పక్షాన ధర్నా చేస్తున్న వారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజ కేంద్రం కొనుగోలు చేసేదాకా రైతుల తరపున టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
ఇంత మండుటెండలో కూడా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి రైతుల పక్షాన ధర్నా చేస్తున్నారని, ఇప్పటికైనా బీజేపీ సర్కార్ బుద్ధి తెచ్చుకుని కళ్లు తెరవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నాయకులు తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని, వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, రైతులు, ఇతర ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు పాల్గొన్నారు.