నిర్మల్ : ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని హంగులతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని అటవి, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించి, సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలో నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా అన్ని వసతులను సమకూర్చామని వెల్లడించారు. పేదరికం కారణంగా ఖరీదైన వైద్యానికి దూరమవుతున్నారని, అలాంటి వారి కష్టాలను తీర్చడానికే ప్రభుత్వ ఆస్పత్రిలో సిటి స్కాన్ (CITY SCAN) ఏర్పాటు చేశామన్నారు. దీంతో పేద ప్రజలకు ఆర్థిక భారంతో పాటు దూర భారం తగ్గిందని తెలిపారు.
జిల్లా ఆసుపత్రిలో పడకల సంఖ్యను పెంచామని, మాతా శిశు సంరక్షణ కోసం చేపట్టిన చర్యల వల్ల సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. సర్జరీలు, సిజెరీయన్లును పూర్తిగా తగ్గించగలిగామని వెల్లడించారు. డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా వివిధ వ్యాధుల నిర్దారణ పరీక్షల సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు. రూ. 42 కోట్లతో జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భవన సముదాయన్ని నిర్మిస్తున్నామని, వైద్య కళాశాల ఏర్పాటుకు రూ. 166 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు.
త్వరలోనే టెండర్లు పిలిచి, సీఎం కేసీఆర్ (CM KCR) చేతుల మీదుగా వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రూ. 30 కోట్లతో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో 2 వేల డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నామని, వాటిలో 1200 ఇండ్ల నిర్మాణం పూర్తి కావచ్చిందని తెలిపారు. వీటిని కూడా సీఎం చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా నాయక్, టీఎస్ఐడీసీ చైర్మన్ వేణుగోపాలచారి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.