ఆదిలాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2021 నివేదిక ప్రకారం దేశంలో కొత్తగా అటవీ విస్తీర్ణం పెరుగుదలలో తెలంగాణకు రెండో స్థానం లభించడం ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కిన గౌరవమని అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి హరితహారాన్ని పట్టుదలతో అమలు చేయడం వల్లనే అటవీ విస్తీర్ణం పెరిగిందని పేర్కొన్నారు. 2025 నాటికి రాష్ట్రంలో 42 శాతం గ్రీనరీ సాధిస్తామని ఆయన శనివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
హరితహారాన్ని ముఖ్యమంత్రి పట్టుదలతో అమలుచేయడం వల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగింది. రాష్ట్రంలో 2015 నుంచి 2021 వరకు ఏడేండ్లలో 235.99 కోట్ల మొక్కలను నాటాం. రాష్ట్రంలో పచ్చదనం 3.79 శాతం పెరిగింది. గ్రీనరీ 28 శాతానికి చేరుకొన్నది.
రాష్ట్రంలో 42% పచ్చదనం
హరితహారం నిరంతరం కొనసాగిస్తాం. 2025 నాటికి 42 శాతం పచ్చదనం సాధించేలా ప్రణాళికలు తయారుచేశాం. మూడేండ్లలో అటవీ విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తుంది.
రాష్ట్రంలో పచ్చదనం పెంపుదలకు పల్లెలు, పట్నాల్లో పార్కులను ఏర్పాటుచేస్తున్నాం. పంచాయతీల్లో 12,500 పల్లెప్రకృతి వనాలు, హైదరాబాద్ పరిసరాల్లో 56 అర్బన్ పార్కులను ఏర్పాటుచేసి, స్థానికులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాం. జీహెచ్ఎంసీలో 3 కోట్లు, హెచ్ఎండీఏలో 7 కోట్ల మొక్కల పెంపకాన్ని చేపట్టాం. పల్లె, పట్టణాల పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ అందిస్తున్నాయి.
ప్రభుత్వం కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఇచ్చే నిధుల్లో 10 శాతం పచ్చదనం పెంపుదలకు ఖర్చు చేస్తున్నది. పంచాయతీలకు ట్రాక్టర్, ట్యాంకర్ను అందించాం. ప్రతి పంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేయడంతో స్థానికులు తమ ఇండ్లలో పండ్లు, పూల మొక్కలను పెంచుతున్నారు. హైదరాబాద్లో వోఆర్ఆర్పై 165 కిలోమీటర్ల మేర నాటిన మొక్కలకు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ లైటింగ్ ఏర్పాటు చేయించారు. ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు కనువిందు చేస్తున్నాయి.
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 2021 నివేదిక ప్రకారం కొత్తగా అటవీ విస్తీర్ణం పెరుగుదలలో తెలంగాణకు దేశంలోనే రెండో స్థానం లభించడం, మెగా సిటీల క్యాటగిరీలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలువడం ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. హరితహారం ఇందుకు ఉపయోగపడింది. అడవుల్లో నరికివేతకు గురైన చెట్ల ఎదుగుదలకు చేపట్టిన రీ జనరేషన్ కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. చెట్లు నరికిన వారిపై పీడీ యాక్టు నమోదుచేస్తున్నాం. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీ తర్వాత అడవుల చుట్టూ కందకాలు తవ్వి గచ్చకాయ మొక్కలను పెంచుతాం.