ఆదిలాబాద్ : శరన్నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి మూల నక్షత్రం సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు.
కుటుంబ సమేతంగా మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న మంత్రి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
నవరాత్రి ఉత్సవాలు మంగళవారం 6వ రోజు మూల నక్షత్రం కావడంతో ఆలయాన్ని అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారు 6వ రోజు కాత్యాయిని దేవి రూపంలో దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ ఈవో వినోద్ రెడ్డి శాలువతో సన్మానించి అమ్మవారి తీర్థ ప్రసాదాలతో బాటు అమ్మవారి ఆశీస్సులను అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాసర క్షేత్రాన్ని అంచలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే రూ.8 కోట్లతో ఆలయ అతిథి గృహాల నిర్మించామన్నారు. ఇంకా 42 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే వాటిని టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు.