హైదరాబాద్, జూలై 11: వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని రేవంత్ రెడ్డికి ఎంత కండ్ల మంట ఉందో అర్థమవుతుందన్నారు.
సీఎం కేసీఆర్ రైతులకు కొండంత అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్టగొట్టేందుకు చూస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ , టీడీపీ పాలనలో కరెంట్ లేక రైతులు అరిగోస పడ్డారని, స్వరాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన నిరంతర కరెంట్ సరఫరాతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతులను మళ్లీ చీకట్లోకి నెట్టేసే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు.
మొదటి నుంచి కాంగ్రెస్ కు రైతులంటే చిన్నచూపని, మొన్న ధరణి వద్దన్నారని, ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. కాంగ్రెస్ రైతు వ్యతిరేఖ పార్టీ అని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ధరణి వద్దని, వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అన్న రేవంత్ రెడ్డి రేపు రైతుబంధు, రైతు బీమా కూడా వద్దంటారని ధ్వజమెత్తారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పి బంగాళఖాతంలో కలపాలని తెలంగాణ రైతాంగానికి పిలుపునిచ్చారు.