హైదరాబాద్ : వైద్య వృత్తి చాలా గొప్పది.. తల్లి జన్మనిస్తే.. పునర్జన్మ ఇచ్చే అవకాశం డాక్టర్కు మాత్రమే ఉంటుంది అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. డబ్బుతో ఏ వస్తువునైనా కొనగలుగుతారు. కానీ డబ్బుతో ప్రాణాన్ని కొనలేరు. ఆ ప్రాణాన్ని పోసే శక్తి వైద్యులకు మాత్రమే ఉంటుందని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా నియామకమైన డాక్టర్లకు నియామక పత్రాలను మంత్రి హరీశ్రావు అందజేశారు. హైటెక్ సిటీ శిల్పాకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు ప్రసంగించారు. కొత్త సంవత్సరంలో కొత్త ఉద్యోగం, కొత్త జీవితం ప్రారంభించబోతున్న మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. వైద్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చరిత్రలో ఇన్ని ఉద్యోగాలు, పారదర్శకంగా చేపట్టడం ఇదే ప్రథమం అని అనుకుంటున్నాను.
గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాను. మీ తల్లిదండ్రులు, గురువులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని మంత్రి అన్నారు. పేదలకు సేవ చేసి గొప్ప డాక్టర్లుగా పేరు పొందాలని కోరుకుంటున్నాను.
చాలా మంది కరోనా సమయంలో కాంట్రాక్ట్ బేసిస్నా పని చేసిన వారు ఉన్నారు. ప్రాణాలకు తెగించి పని చేశారు. కరోనా సమయంలో కష్టపడ్డ డాక్టర్లకు రెగ్యులర్ రిక్రూట్మెంట్లో 20 మార్కులను వెయిటేజీ కింద ఇచ్చాం. దీంతో చాలా మందికి అవకాశాలు వచ్చాయన్నారు. 20 నుంచి 40 శాతం పీజీ సీట్లలో కూడా రిజర్వేషన్ కల్పించాం అని తెలిపారు. రేపట్నుంచి కొత్త ఉద్యోగాల్లో చేరితే బాగుంటుంది. గ్రామాల ప్రజలు కూడా సంతోషపడుతారు. ప్రజలకు అందుబాటులో ఉండండి. పేదలకు సేవ చేయండి. మీ పీహెచ్సీ పరిధిలో ఉత్తమమైన సేవలు అందించండి. చేతులెత్తి దండం పెడుతున్నా.. ట్రాన్స్ఫర్లకు ఎవరూ తన వద్దకు రావొద్దు. కనీసం 2-3 ఏండ్లు ఇచ్చిన పోస్టింగ్లో పని చేయాలన్నారు. బాగా పని చేస్తే ట్రాన్స్ఫర్లకు సంబంధించిన కౌన్సెలింగ్లో వెయిటేజీ కల్పిస్తామని మంత్రి హరీశ్రావు సూచించారు.