నల్లగొండ జిల్లాకేంద్రంలో బుధవారం నుంచే కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ప్రారంభించాలని కలెక్టర్ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. నల్లగొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మెడికల్ కాలేజ్, హాస్పిటల్ను క్షుణ్నంగాఈ పరిశీలించారు. వివిధ అంశాలపై వైద్యులు, సిబ్బందితో సమీక్షించారు. వైద్యుల పనితీరుపై ఆరా తీశారు. సిబ్బంది టైం రిజిస్టర్ను తనిఖీ చేశారు. అన్ అథరైజ్డ్ అటెండెన్స్ ఉన్న వైద్యులు, సిబ్బందికి నోటీసులు ఇవ్వాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ, దవాఖానకు సకాలంలో ఎంతమంది వైద్యులు హాజరైంది తనిఖీ చేసినట్లు చెప్పారు. కొత్త కాలేజీ నిర్మాణం గురించి డాక్టర్లు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. జిల్లా కేంద్రంలో కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ను ఆదేశించానని చెప్పారు. దవాఖానలో సమస్యలను తెలుసుకున్నానని, వాటిని అధిగమించి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించానని పేర్కొన్నారు.
కొత్త డైట్ పాలసీని పాటించాలి..
కొత్త డైట్ పాలసీ ప్రకారం దవాఖానలో పేషెంట్లకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. గైనిక్ డిపార్ట్మెంట్లో 500 లోపే ప్రసవాలు జరుగుతున్నాయని, వాటిని 700 వరకు పెంచాలన్నారు. హైదరాబాద్కు రెఫరల్ తగ్గించి, వీలైనంతవరకు ఇక్కడే వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆర్థోపెడిక్ విభాగంలో కీలక వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాయంత్రం వేళల్లో కూడా ఓపీ చూసేందుకు ఒప్పుకున్న వైద్యులకు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్నిరకాల వైద్య సేవలు ప్రభుత్వ దవాఖానలోనే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ వల్లే ఒక్క జిల్లాలో రెండు మెడికల్ కళాశాలలు వచ్చాయన్నారు. సీజనల్ వ్యాధులపట్ల వైద్యులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.