తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారమన్ ప్రధానిస్థాయిన దిగజార్చేలా మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. మెదక్ జిల్లా తూఫ్రాన్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి అయి ఉండి ప్రధాని ఫొటో రేషన్షాపుల ముందు పెట్టమంటారా? అని మండిపడ్డారు. మొత్తం రేషన్ బియ్యం కేంద్రమే ఇచ్చినట్టు నిర్మాలాసీతారామన్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం కేవలం 55 శాతం బియ్యం మాత్రమే ఇస్తున్నదని, అదికూడా కిలోకు రూ. మూడు వసూలు చేస్తున్నదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వమే తన ఖజానా నుంచి రూ. 3,610 కోట్లు ఖర్చుపెట్టి ఒక్కొక్కరికీ పది కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నదని చెప్పారు. అలా అని రేషన్ షాపుల ముందు సీఎం కేసీఆర్ బొమ్మ పెట్టామా? అని నిర్మలాసీతారామన్ను ప్రశ్నించారు.
దేశాన్ని సాదే ఐదు ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ నుంచి దాదాపు లక్షా 70 వేల కోట్లు కేంద్రానికి అదనంగా ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ నిధులను ఇతర రాష్ట్రాలకు కేంద్రం పంచుతున్నదని తెలిపారు. మరి ఆయా రాష్ట్రాల్లో, కేంద్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫొటో పెడుతారా? అని నిర్మలాసీతారామన్ను ప్రశ్నించారు. తెలంగాణ నుంచి రూ. 3 లక్షల 65 వేల 797 కోట్లు కేంద్రానికి వివిధ పన్నుల రూపంలో చేరితే, కేంద్రంనుంచి తెలంగాణకు వచ్చింది కేవలం
రూ. లక్షా 96వేల 448 కోట్లు మాత్రమేనని అన్నారు. పోయింది ఎక్కువ.. వచ్చింది తక్కువ అని చెప్పారు. కేంద్రాన్ని సాదడంలో తెలంగాణ వాటా ఉన్నదని, తెలంగాణ ప్రజల సంపద ఉన్నదని స్పష్టంచేశారు.
బీజేపీ మంత్రుల గోబెల్స్ ప్రచారం..
కేంద్రంనుంచి తెలంగాణకు వస్తున్న మంత్రులు అన్నీ అబద్ధాలే ఆడుతున్నారని, గోబెల్స్ను మించిపోయారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. అమిత్ షా వచ్చి కాళేశ్వరంతో ఒక్క ఎకరా పారలేదన్నారని, కానీ అదే పార్టీకి చెందిన నితిన్ గడ్కరీ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు గ్రోత్ ఇంజిన్ ఆఫ్ తెలంగాణ అని ప్రశంసించారన్నారు. ఈ ప్రాజెక్టుకు తామే అనుమతిలిచ్చామని అబద్దం చెప్పారన్నారు. జాతీయస్థాయిలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇన్ని అబద్దాలు ఆడుతరా? ఇది మీకు తగునా? అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా హెల్త్ సిటీ ఏదని ప్రశ్నిస్తే..ఐదు నిమిషాల్లో ఫొటోలు రిలీజ్ చేశానని, ఒక్కరూ కిక్కుమనలేదన్నారు. నాలుగేళ్ల కింద ఎయిమ్స్కు స్థలమిస్తే తట్టెడు మన్నుతీయలేదని మండిపడ్డారు.
ఆయుష్మాన్ భారత్లో చేరితే ప్రజలకు నిజాలు తెలుస్తాయని నిర్మలాసీతారామన్ అంటున్నారనీ, ‘అమ్మా నిర్మలమ్మా తెలంగాణ ఆయుష్మాన్లో చేరకుంటే నేను రాజీనామా చేస్తా..? చేరితే మీరు రాజీనామా చేస్తారా?’ అని మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. 18 మే 2021లోనే ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరిందని పార్లమెంట్లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సమాధానం చెప్పారని గుర్తుచేశారు. 2021-22లో తెలంగాణకు ఆయుష్మాన్ భారత్ కింది రూ. 150 కోట్లు కూడా కేటాయించారన్నారు. తెలంగాణ సర్కారు మొత్తం 1,010 కోట్లు ఖర్చు చేస్తే వారు కేవలం రూ. 150 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఆయుష్మాన్ భారత్లో 26 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ధి జరుగుతుందని, అదే ఆరోగ్య శ్రీ కింద 90 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరకపోతే రూ. 150 కోట్లు ఎందుకు ఇచ్చారని నిర్మలా సీతారామన్ను మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. అబద్ధాలు ప్రచారం చేసిన కేంద్రమంత్రి ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాల మంత్రుల లిస్టులో నిర్మలా సీతారామన్కూడా చేరిపోయారన్నారు.
అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే…
కేంద్రం తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాలపై బురద జల్లుతున్నదని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. 2022 ప్రపంచ ఆకలి సూచీలో లో భారత్ ది 101వ స్థానంలో నిలిచిందని, బీజేపీ అధికారంలో రాకముందు 55వ స్థానంలో ఉండేదని చెప్పారు. నిరుద్యోగిత 9.4 శాతం-11 శాతానికి పెరిగిందన్నారు. ఇది బీజేపీ ఘనత అని ఎద్దేవా చేశారు. దేశానికి ఓ మహిళ ఆర్థికమంత్రిగా ఉన్నా మహిళలు కన్నీళ్లు పెట్టుకునేవిధంగా రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ. 1200 చేశారని మండిపడ్డారు. అచ్చే దిన్ కాదు.. పొయ్యిలకట్టెల దిన్ వచ్చిందని అన్నారు. దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి..పెట్టుబడి రెట్టింపు చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు రూ. 70 నుంచి రూ.115చేసి రైతులకు పెట్టుబడి పెంచారని మండిపడ్డారు. సామాన్యుడి నడ్డి విరిచారన్నారు. ప్రపంచ దేశాలముందు మన రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతున్నదని, 2014లో డాలర్ విలువ రూ. 63 ఉంటే నేడు రూ. 80కి పడిపోయిందన్నారు. బీజేపీ సర్కారు అద్భుతమైన పరిపాలనుకు ఇది నిదర్శనమని ఎద్దేవా చేశారు. తలసరి ఆదాయంలో మనదేశం 144వ స్థానానికి పడిపోయిందన్నారు. అదానీ మాత్రం ప్రపంచ కుబేరుల్లో మూడోస్థానానికి ఎగబాకాడని చెప్పారు.
అన్ని రంగాల్లో దేశ సగటుకన్నా తెలంగాణ సగటు ఎక్కువని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం రూ. 2 లక్షల 78 వేల 823 రూపాయలని, ఇది కేంద్ర ప్రభుత్వం లెక్కలేనని చెప్పారు. ఈ దేశ తలసరి ఆదాయం లక్షా 49వేలు మాత్రమేనన్నారు. తలసరి ఆదాయం, జీడీపీ, నిరుగ్యోతి శాతం, పేదరికం ఇలా ఏది చూసినా దేశంకంటే తెలంగాణ బెస్ట్ అని పేర్కొన్నారు. ఆర్బీఐ లెక్కల ప్రకారం.. దేశంలో డెట్ టు జీఎస్డీపీ రేషియోలో 23.5శాతమే తెలంగాణదని చెప్పారు. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ 30 2021న చెప్పిందన్నారు.
ప్రతి పౌరుడి మీద లక్షా 25 వేల అప్పు ఉందంటూ నిర్మలాసీతారామన్ అర్థసత్యాలు మాట్లాడారని మంత్రి హరీశ్రావు మండిప్డారు. ఆర్బీఐ ప్రకారం..89 వేల 188 రూపాయలు మాత్రమే కలిగి ఉన్నదని చెప్పారు.కేంద్రం అప్పు కోటి 52 లక్షల 17వేల 910 కోట్లని చెప్పారు. ప్రతి పౌరుడి మీద లక్షా 20 వేల అప్పు ఉందని వివరించారు. కేంద్రం అప్పు చేసి, తెలంగాణపై రుద్దుతున్నదని మండిపడ్డారు. రైతుల కష్టాలు తీర్చేందుకే అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టుకున్నామని, ఆ ప్రాజెక్టుల వల్లే పంటలు పండుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి ఇక్కడికి కూలీలు పనికివస్తున్నరని చెప్పారు.. దేశంలో అధికంగా వరిధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందంటూ నిర్మలాసీతారమన్ అబద్ధాలు మాట్లడారన్నారు. తెలంగాణలో 2014లో 898 మంది రైతులు చనిపోతే.. 2020 లో 426 మంది ఆత్మహత్య చేసుకున్నారని, ఆత్మహత్యలు సగానికి సగం తగ్గినయ్ అని పార్లమెంట్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారని గుర్తుచేశారు. బీజేపీ నాయకులు ఢీల్లీలో ఓ మాట.. గల్లీలో మరోమాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.