సిద్దిపేట : అర్హత కలిగిన వారందరూ ఆసరా, రైతు బీమా పథకంలో నమోదు అయ్యేలా చూడాలని సిద్దిపేట ప్రజా ప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు మొత్తం 2 వేల మందితో మంత్రి ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచలోనే రైతులకు బీమాతో ధీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. దేశంలో సీఎం కేసీఆర్ మాత్రమే 57 సంవత్సరాల వయస్సు నిండిన వారికి పెన్షన్ అందించే ఆలోచన చేశారన్నారు. సిద్దిపేట జిల్లాలో ఈ నెలాఖరులోగా అర్హులైన వారందరినీ ఆసరా పథకం, రైతు బీమా పథకంలో నమోదు అయ్యేలా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు.
అర్హులందరిని ఆసరా పథకం, రైతు బీమా పథకంలో చేర్పించే బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులదేనని మంత్రి అన్నారు. అర్హులందరూ తప్పక దరఖాస్తు చేసుకోవాలన్నారు. పెన్షన్ నమోదు కోసం లబ్దిదారులు మీ సేవలో డబ్బులు చెల్లించవద్దన్నారు. ప్రభుత్వమే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు డబ్బులు చెల్లిస్తుందన్నారు.
ప్రతి రైతు వేదికలో కనీసం వారానికి ఒకసారైనా రైతు చైతన్య సమావేశాలు నిర్వహించాలని మంత్రి హరీశ్ తెలిపారు. అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. నిర్మాణాలు పూర్తైయి ఇప్పటికీ వినియోగంలోకి రాని వైకుంఠ ధామాలు, డంప్ యార్డ్ లను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ప్రతి డంప్ యార్డ్ లో కంపోస్ట్ తయారు కావలసిందేనన్నారు. అసంపూర్తి వైకుంఠ ధామాలు, రైతు వేదికలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ డిమాండ్ నేపథ్యంలో రైతులు ప్రత్తి , కందుల సాగును చేపట్టాలని ప్రోత్సహించాలని మంత్రి అన్నారు. లాభదాయకమైన ఆయిల్ పామ్, మల్బరీ సాగును సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులు చేపట్టేలా ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు చైతన్యం చేయాలన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. వ్యవసాయ అధికారులు యాసంగి సాగు కార్యాచరణ ప్రణాళిక పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో భవన నిర్మాణ అనుమతుల్లో జాప్యం జరగకుండా జిల్లా అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీకి వైకుంఠ ధామం, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ మంజూరు చేసినందున నిర్మాణం స్థలం, డిజైన్ లు ఫైనల్ చేసి వెంటనే పనులు ప్రారంభిoచాలని మంత్రి పేర్కొన్నారు.