హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా కొన్ని బిల్లులు పెండింగ్లో పడుతున్నాయని మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు కేంద్రం నుంచి రూ.1,100 కోట్లు రావాల్సి ఉన్నదని వెల్లడించారు. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకపోవడంతో ఆయా బిల్లులు పెండింగ్లో పడి.. సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి 15 రోజుల పాటు జరుగనున్న ఐదో విడుత పల్లెప్రగతి, నాలుగో విడుత పట్టణ ప్రగతిపై మంత్రులు హరీశ్రావు, దయాకర్రావు సోమవారం బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు. గతంలో చేపట్టిన పనులు, తాజాగా చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా కేంద్రం ఉపాధి హామీ కింద నయా పైసా విడుదల చేయలేదని తెలిపారు. ఉపాధిహామీ కింద చేపట్టిన పనులకు కేంద్రం ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఈ నెల మొదటి వారంలో లేఖ రాసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. మరోవైపు 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి హకుగా రావాల్సిన రూ.1,013 కోట్లు కూడా ఇవ్వలేదని వివరించారు. అయినా తెలంగాణ ప్రభుత్వం పల్లెలు, పట్టణాల అభివృద్ధికి నిరుడు రూ.4,619 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. కేంద్రం సహకరించకపోయినా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.514.3 కోట్ల బిల్లులు చెల్లించిందని, మరో రూ.285 కోట్ల చెల్లింపులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. వీటిని రాబోయే రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి బకాయిలు లేకుండా పూర్తిగా చెల్లించాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులపై మరొకసారి కేంద్రానికి లేఖ రాసి, ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడాలని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాను ఆదేశించారు. కేంద్రం నిధులు విడుదల చేసిన వెంటనే త్వరితగతిన చెల్లింపులు చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
పల్లె, పట్టణ ప్రగతితో సమగ్రాభివృద్ధి
సీఎం కేసీఆర్ మేధోమథనం నుంచి పుట్టిన పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు తెలంగాణ సమగ్రాభివృద్ధికి నాంది పలికాయని మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు మొత్తం రూ.11,711 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. ఈ నిధులతో పల్లెలు, పట్టణాల స్వరూపం మారిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఐదో విడత పల్లెప్రగతి, నాలుగో విడత పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎకడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 6న తొలి విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించగా, అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నదని గుర్తు చేశారు. పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాల నిర్మాణం, పారిశుద్ధ్యం పెంపొందించడం, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ సమకూర్చినట్టు వివరించారు. ఈ కార్యక్రమాల వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
కేంద్రం సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనలో 20 ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తే, అందులో 19 తెలంగాణకు చెందినవి ఉండటం దీనికి నిదర్శనమన్నారు. హరితహారం, పల్లెప్రకృతి వనాల వల్ల రాష్ట్రంలో గ్రీన్కవర్ 7.7 శాతం పెరిగిందని గుర్తుచేశారు. గతంలో పూర్తి చేసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల స్ఫూర్తితో ఈ సారి సైతం స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకొని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.