హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం ఈ 9 ఏండ్లలో సాధించిన విజయాలను ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. జూన్ 2న ప్రారంభమై 21 రోజులపాటు కొనసాగనున్న ఉత్సవాల ప్రణాళికను సిద్ధం చేసేందుకు శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, నిరంజన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. గత 9 ఏండ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ఉత్సవాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ 2న హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని, జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఉత్సవాలపై రూపొందించే డాక్యుమెంటరీల గురించి సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ ఆయా శాఖలు సాధించిన విజయాలను చాటిచెప్పేలా శాఖలవారీగా డాక్యుమెంటరీలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మంత్రులు చేసిన ప్రతిపాదనలు, సూచనలపై చర్చించి తదుపరి సూచనల కోసం సీఎంకు సమర్పిస్తారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీఎం ప్రధాన కార్యదర్శి నర్సింగరావు, డీజీపీ అంజనీకుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, అధర్ సిన్హా, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
దశాబ్ది ఉత్సవాలను గ్రామగ్రామాన పండుగలా నిర్వహించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆయా గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విజయోత్సవాలు ఉట్టిపడేలా ఇండ్లముందు రంగవల్లులను తీర్చిదిద్దేలా మహిళలను సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణకు ముందు, తర్వాత జరిగిన అభివృద్ధిపై డాక్యుమెంటరీలు రూపొందించాలని, ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ శాఖ పదేండ్లలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. శుక్రవారం సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాల్లో రైతు వేదికలు, చెరువులు, రిజర్వాయర్ల వద్ద కార్యక్రమాలతో వ్యవసాయ విజయాలను ప్రజలకు వివరించాలని సూచించారు.