హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ బూస్టర్ డోస్కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు పూర్తి చేసుకుని, అర్హులైన వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో బూస్టర్ డోసు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మాండవీయకు హరీశ్రావు లేఖ రాశారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 60 ఏండ్లు దాటిన వారికి మాత్రమే ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది. 18 ఏండ్లు పైబడిన వారికి ఏప్రిల్ 10 నుంచి ప్రికాషనరీ డోస్ ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ప్రైవేటు ఆసుపత్రులకే అనుమతించింది. ఈ క్రమంలో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 18-59 ఏండ్ల వయస్సున్న వారికి ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు అనుమతించాలని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఏప్రిల్ 10 నాటికి దాదాపు 9,84,024 మంది ప్రికాషనరీ డోసు పొందేందుకు అర్హులుగా ఉన్నారని మంత్రి తెలిపారు.
తెలంగాణలో 18 ఏండ్లు పైబడిన వారికి మొదటి డోసును 106 శాతం, రెండో డోసును 100 శాతం, 15-17 ఏండ్ల కేటగిరీలో మొదటి డోసును 90 శాతం, రెండో డోసును 73 శాతం, 12-14 ఏండ్ల వయస్సు వారికి 78 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో, వ్యాధి ప్రభావాన్ని తగ్గించడంలో విస్తృతంగా నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంతో తోడ్పడిందని పేర్కొన్నారు.