Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ రైతులకు రైతుబంధు సకాలంలో దక్కొద్దని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ప్రతి వానాకాలం, యాసంగి ముందు రైతుబంధు ఇచ్చాం. ఆసరా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం వంటి పథకాలను ఆపమని చెప్పేలా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇంతకంటే బాగా చేస్తామని చెప్పాలి. కానీ రైతుల వద్దకు వస్తే ఖబడ్దార్.. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా. రైతులు మీ డిపాజిట్లు గల్లంతు చేస్తారని హెచ్చరిస్తున్నానని హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుందని హరీశ్రావు ధ్వజమెత్తారు. నిన్న ఢిల్లీలో ఎన్నికల కమిషన్ను కలిసి యాసంగి రైతుబంధు ఆపాలని ఫిర్యాదు చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉందనేది ఈ ఫిర్యాదుతో తెలుస్తుంది. రైతుబంధు కొత్త పథకం కానే కాదు. గత ఆరు సంవత్సరాలుగా నడుస్తోంది. ఇప్పటి వరకు 11 సార్లు 11 విడతలుగా రూ. 75 వేల కోట్లు నేరుగా రైతులకు బదిలీ చేశాం. నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ చేయలేదు. పథకాల సృష్టికర్త కేసీఆర్ అని హరీశ్రావు స్పష్టం చేశారు.
గత ప్రభుత్వాలు నీటి తీరువా, కరెంట్ బిల్లులు, రైతు చేత పన్నులు కుట్టించుకున్నాయని హరీశ్రావు తెలిపారు. కానీ రైతులకు తిగిరి డబ్బులిచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఈ దేశానికి దశ దిశ చూపించారు కేసీఆర్. రైతుబంధును కేంద్రం కాపీకొట్టి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అని తెచ్చింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ తరహాలో అమలు చేస్తున్నాయి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక విషయం అర్థమైపోయింది. రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదని. తలకిందుల తప్పసులు చేసినా కాంగ్రెస్ పార్టీకి పెన్షన్ దారులు ఓటు వేయరు. 69 లక్షల మంది రైతులకు నగదు బదిలీ కింద రైతుబంధు పథకం అమలవుతుంది. ఈ 69 లక్షల మంది రైతులు బీఆర్ఎస్కు ఓటేస్తారని, కక్షపూరితంగా, కుట్రతో కాంగ్రెస్ వ్యవహరిస్తోందని హరీశ్రావు మండిపడ్డారు.
ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చి మాట తప్పేటోళ్లం కాదు మేం అని హరీశ్రావు స్పష్టం చేశారు కాందు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుబంధును కేసీఆర్ ప్రారంభించారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. 2017-18 లో రైతుబంధు ప్రారంభించి 11 సార్లు రైతుబంధు ఇచ్చాం. 12వ విడతో రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఎలా ఇస్తుందని హరీశ్రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం అని హరీశ్రావు స్పష్టం చేశారు. వారి హయాంలో రైతులకు కరెంట్ సరిగా ఇవ్వలేదు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి 3 గంటలు కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి.. మా నాన్న చనిపోతే బాయి కాడ స్నానం చేద్దామంటే కరెంట్ రాలేదు.. చూసి చూసి నెత్తిమీద నీళ్లు చల్లుకోని పోయిన అని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఈ రోజు మాట మారుస్తాడు. ఆనాడు బలిదేవత.. ఇప్పుడే దేవత అంటున్నాడు అని రేవంత్పై హరీశ్రావు నిప్పులు చెరిగారు.
నిన్న కర్ణాటక నుంచి రైతులు వచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు.. మమ్మల్ని ఆగం చేసింది అని సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారని మరీశ్రావు గుర్తు చేశారు. ఆనాడు బీజేపీ ప్రభుత్వంలో 8 గంటల కరెంట్ వస్తుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 3 గంటల కరెంట్ కూడా వస్తలేదని బాధపడుతున్నారు. కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రే ఐదు గంటలు కరెంట్ ఇస్తామని చెబుతున్నాడు. టీ పీసీసీ అధ్యక్షుడు మూడు గంటలే అంటున్నాడు. కర్ణాటక రైతులు పురుగుల మందు తాగుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. మొసలిని సబ్ స్టేషన్లో వదిలి నిరసన వ్యక్తం చేస్తున్నారు అని హరీశ్రావు తెలిపారు.
ఇవాళ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని హరీశ్రావు తెలిపారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉండి నీళ్లు ఇవ్వకపోయినా నీటి తీరువా వసూలు చేశారు. పండిన పంటలను కొనలేదు. మోటార్లు కాలే పరిస్థితి. పాములు, తేళ్లు కుట్టి చనిపోయిన పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. సాగునీటి సౌకర్యం అందించాం. పండిన పంట కొంటున్నాం. రైతును రాజు చేశాం. ఈ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెడుతారని హరీశ్రావు పేర్కొన్నారు.