హుజూరాబాద్ : ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్లో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్రావు ప్రజాప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి గ్రామంలో ఏర్పాటు అవుతున్న సీఎం సభావేదికను మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు, పోలీసు అధికారులకు మంత్రి హరీశ్రావు పలు సూచనలు చేశారు. దళిత బంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోయే సీఎం సభలో 10 బ్లాకులు ఏర్పాటు చేయాలని సూచించారు. 5 బ్లాకులు మహిళలకు, మిగతా 5 బ్లాకులను ప్రజాప్రతిధులు, ప్రజలకు కేటాయించాలని ఆదేశించారు. వీఐపీ, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలన్నారు. మెయిన్ డయాస్ పక్కన కళాకారులకు వేదిక ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ట్రాన్స్కో ఎస్ఈని మంత్రి ఆదేశించారు.
కేసీఆర్ సభకు జనాలను తరలించేందుకు 825 బస్సులు ఏర్పాటు చేశామని హరీశ్రావు తెలిపారు. ప్రతి బస్సుకు ఒక ఇంచార్జిని నియమించాలని ఆదేశించారు. లబ్దిదారులకు ఆహార ప్యాకెట్లు బస్సుల్లోనే పంపిణీ చేయాలని పేర్కొన్నారు. సభా ప్రాంగణంలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి వెళ్లేలా చూడాలని వైద్యాధికారులకు సూచించారు. ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలన్నారు.
సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమీషనర్కు మంత్రి సూచించారు. సభా ప్రాంగణంలోని మహిళల బ్లాక్ల వద్ద మహిళా పోలీసులను, ఇతర బ్లాక్ల వద్ద పురుష పోలీసులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించాలని పోలీస్ కమీషనర్కు మంత్రి హరీశ్రావు సూచించారు.