యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీశ్ యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
అంతకుముందు యాదగిరిగుట్టలో 100 పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.