హైదరాబాద్: గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ (Zaheeruddin Ali khan) కుటుంబ సభ్యులను మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) పరామర్శించారు. మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి హైదరాబాద్ లక్డీకాపూల్లోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి హరీశ్ రావు.. అలీఖాన్ మరణపట్ల సంతాపం వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉర్దూ పత్రిక రంగానికి జహీరుద్దీన్ చేసిన సేవలను మంత్రి హరీశ్ గుర్తుకుచేసుకున్నారు.
సోమవారం ప్రజాగాయకుడు గద్దర్ అంతిమయాత్రలో పాల్గొన్న అనంతరం ఆయన స్నేహితుడు, సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఎల్బీస్టేడియం నుంచి అల్వాల్లోని భూదేవీనగర్ వరకు సాగిన గద్దర్ అంతిమయాత్రలో ఆయన పాల్గొన్నారు. అయితే భూదేవీనగర్లోని గద్దర్ ఇంటి సమీపంలో ఛాతిలో నొప్పి రావడంతో ఆయన రోడ్డు పక్కనే పడిపోయారు. గమనించిన స్థానికులు ఆయనను సమీపంలోని దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అలీఖాన్ మృతికి గుండెపోటు కారణమై ఉంటుందని డాక్టర్లు పేర్కొన్నారు.