Minister Harish Rao | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడని, ఆరాధనీయుడని.. అందరు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. కొహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి హరీశ్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహావిష్కరణకు కృషి చేసిన సంఘాలు, గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి సమాజంలో దేశంలోని ఎన్నో కులాలు, మతాలకు చెందిన వారంతా కలిసి ఉండడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని చెప్పుకోక తప్పదన్నారు. అన్నివర్గాలు బాగుపడాలని, ముందుకు రావాలనే ముందుచూపుతో స్వీయ అనుభవంతో చేసిన ఆలోచనలన్నారు.
నేటి విద్యార్థి లోకం, సమాజం ఆదర్శంగా తీసుకోవాలని, వీధిదీపాల కింద చదువుకొని విదేశాలకు వెళ్లి.. రాజ్యాంగం రాసి ఈ స్థాయికి వచ్చేరంటే దేశానికి ఎంతో ఆదర్శవంతం అన్నారు. ప్రపంచంలో అత్యంత విగ్రహాలు కలిగిన మహానేత అంబ్కేదర్ అన్నారు. సమాజసేవ, సమాజ హితం, సమాజం కోసమై ఆలోచించే వారు చాలా తక్కువ మంది ఉంటారని, అందులో పెద్దగా చెప్పుకునేది అంబేద్కర్ గురించి మాత్రమేనన్నారు. విద్య అనేది ఎంత ముఖ్యమో సమాజానికి చాటి చెప్పిన మహానేత అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని స్ఫూర్తినిచ్చిన నేత అన్నారు.
2014-15లో రాష్ట్రంలో గురుకులాలు 298 మాత్రమే ఉండేవని, సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి 1,021కి పెంచారన్నారు. 2014లో 1,12,667 మంది విద్యార్థులు మాత్రమే ఉంటే.. ఇవాళ ఈ సంఖ్య 5,40,366కి పెరిగిందన్నారు. నేటి విద్యార్థులు రేపటి పౌరులుగా మారి జాతి సంపదగా ఉపయోగపడతారని సీఎం కేసీఆర్ విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మహిళల కోసం 50 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. మహిళల గురించి గొప్పగా ఆలోచించి ఉన్నత స్థాయిలో ఉంచాలనే లక్ష్యంతో కేసీఆర్ సర్కారు ఆడపిల్ల చదువు కోసం ఖర్చు చేస్తుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించినట్లు తెలిపారు. ‘మన ఊరు – మనబడి’ కార్యక్రమంలో ప్రతి పాఠశాలను బాగు చేసుకోవడంతో పాటు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా విజ్ఞానాన్ని అందించేందుకు డిజిటల్ క్లాస్ రూమ్, ఇంటర్నెట్ సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి తోడుంటానని, ఎల్లవేళలా శాయశక్తులా కష్టపడుతానని హరీశ్రావు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, స్థానిక ఎమ్మెల్యే సతీశ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.