భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పోడు గోడుకు గిరిజనులు వీడ్కో లు చెప్పే రోజు వచ్చిందని, ఆ ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పోడు రైతులపై నమోదైన కేసులన్నింటినీ ప్రభుత్వం ఎత్తివేస్తుందని, ఆ దిశగా కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇక ఏ అధికారీ పోడుభూముల జోలికి రారని చెప్పారు. శుక్రవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచతోపాటు, ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలోనే గిరిజనులకు అన్నివిధాలుగా న్యాయం జరిగిందని చెప్పారు. ఎంతోకాలం ఎదురుచూసిన వారి కలలు నేడు ఫలించాయని పేర్కొన్నారు. అడవిని నమ్ముకుని జీవిస్తున్న పోడు రైతులకు పట్టాలు ఇచ్చిన సీఎం కేసీఆర్ వారిని భూ యజమానులను చేశారని వివరించారు. పోడు పట్టాతో పది రకాల ప్రయోజనాలు ఒనగూరుతాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం తెచ్చిందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం ద్వారా మా తండాలో మా రాజ్యం అనే నినాదాన్ని కేసీఆర్ నిజం చేశారని చెప్పారు. మిషన్ భగీరథతోపాటు వైద్య సదుపాయాలు మెరుగుపర్చడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులు దూరమయ్యాయని తెలిపారు. గత పాలకులు 60 ఏండ్లలో 91 గిరిజన గురుకులాలు ఏర్పాటుచేస్తే సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో 95 గురుకులాలు ఏర్పాటు చేశారని వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అర్హులు అందరికీ పోడు భూముల పట్టాలు అందుతాయని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. తరతరాల పోడు సమస్యకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారని ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.