హైదరాబాద్ : విద్యార్థుల తల్లిదండ్రులతో వారంలోగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్ధిపేట కలెక్టరేట్లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎసెస్సీ ఉత్తమ ఫలితాల కోసం ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రితో పాటు కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, యాదవరెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఒడితెల సతీశ్బాబు, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఈడీఓ శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ గతేడాది జిల్లాను పదో తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిపినందుకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో పది ఫలితాల్లో 5వ స్థానం నుంచి తొలిస్థానానికి వచ్చామన్నారు. ఈ ఏడాది సైతం మొదటి స్థానాన్ని నిలుపుకునేందుకు గత స్ఫూర్తితో ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. గతేడాది తరహాలో ఈ ఏడాది సైతం పిల్లల తల్లిదండ్రులకు ఉత్తరాలు రాసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 10/10 సాధించడంలో వెనుకపడిపోయామని, గ్రామాల్లోని పాఠశాలలను ప్రజాప్రతినిధులు, యువత దత్తత తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.
పిల్లలు మొబైల్ ఫోన్లకు ఎక్కువ ఆకర్షితులయ్యారని, విద్యార్థులకు 10లక్షలతో కేసీఆర్ డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో 14,576 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇందులో 11,261మంది విద్యార్థుల ప్రభుత్వ పాఠశాలల్లో, మరో 3,315 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారని మంత్రి తెలిపారు. పదిలో 97.85శాతం గత ఏడాది ఫలితాలు వచ్చాయని, 10/10సాధించిన విద్యార్థులకు రూ.10వేలు రూపాయలు, 100శాతం ఉత్తీర్ణత సాధించిన సాధించిన పాఠశాలలకు రూ.25వేలు పారితోషకం అందజేస్తామని మంత్రి ప్రకటించారు.