హైదరాబాద్ : భారత రాష్ట్ర సమతికి వీఆర్ఎస్ అని బీజేపీ జాతీయ నాయకుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ అంటే మాకు ఓటమి లేదని నడ్డా ఒప్పుకున్నట్టే కదా? అని హరీశ్రావు అన్నారు. వీఆర్ఎస్ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ. అంటే మాకు మేము స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంటే తప్పా.. బీఆర్ఎస్కు తిరుగులేదు. అంటే తనకు తాను స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకుంటే తప్పా.. బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని, ఓటమి లేదని స్వయంగా నడ్డా ఒప్పుకున్నట్టు అని హరీశ్రావు పేర్కొన్నారు. నిన్నటి సభలో ఏమైందంటే ప్రాస కోసం తండ్లాడితే.. పాట్లు పడినట్లు అయింది. ఎవరో ఏదో రాసిస్తే నడ్డా గుడ్డిగా చదివారని హరీశ్రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయలేదని నడ్డా మాట్లాడుతున్నారు. మీరు ఏ హామీ నిలబెట్టుకున్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. రూ. 15 లక్షలు ఖాతాల్లో వేస్తామని చెప్పారు. నల్లధనం తీసుకొచ్చారా? రూపాయి విలువ పెంచుతామని చెప్పారు. కానీ ఇవాళ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయకుండా, డిజీల్, ఎరువుల ధరలు పెంచి రైతుల పెట్టుబడిని రెట్టింపు చేశారు. పేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పారు. కానీ అమలు చేయలేదు. కోట్ల కోద్ది కోలొవులు ఇస్తమంటిరి.. లక్షల కొద్ది డబ్బులు ఇస్తమంటిరి దాని సంగతి చెప్పకపోతిరి. దాని సంగతి ఏందో ప్రజలకు చెప్పండి అని హరీశ్రావు డిమాండ్ చేశారు.
మేం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా, ప్రజలకు అవసరమైన పథకాలను అమలు చేసిన నాయకుడు కేసీఆర్ అని హరీశ్రావు స్పష్టం చేశారు. మిషన్ భగీరథను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ అమలు చేశాం. కల్యాణలక్ష్మి ఎన్నికల్లో చెప్పలేదు. ఓట్ల కోసం ఆపద మొక్కులు మొక్కలేదు. పేదింటి ఆడబిడ్డలకు, తల్లులకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని వర్గాలకు కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నారు. రైతు బంధు ఇస్తామని ఎన్నికల్లో చెప్పలేదు. ఎన్నికల్లో చెప్పకపోయినప్పటికీ ప్రతి ఎకరానికి రైతు బంధు ఇచ్చి ఆదర్శంగా నిలిచారు కేసీఆర్. రైతు బీమా కూడా ఎన్నికల హామీ కాదు. ఎవరూ అడగనప్పటికీ రైతులను దృష్టిలో ఉంచుకుని రైతుబీమా అమలు చేశారు. గత ప్రభుత్వాలు రైతుల మరణిస్తే ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. కేసీఆర్ కిట్ అద్భుతంగా సక్సెస్ అయింది. ఇది కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. గర్భస్రావాలు, శిశు మరణాలు, తల్లి మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో కేసీఆర్ కిట్ అమలు చేశాం. ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. 30 శాతం నుంచి 66 శాతానికి ప్రసవాల సంఖ్య పెరిగింది. ఇది మేం సాధించిన విజయం. వైద్య సేవలు మెరుగుపడటంతో తల్లి మరణాలను బాగా తగ్గించగలిగామని హరీశ్రావు తెలిపారు.
మీరేమో ఎంత సేపు రాజకీయాలు చేస్తారు. ఎలా గెలవాలి. వెన్నుపోటు ఎలా పొడవాలి. కేసులు పెట్టాలన్నదే మీ బుద్ధి. కేసీఆర్ ప్రజా సేవ కోసం తల్లడిల్లుతాడు. పేద వర్గాల కోంస ఆలోచిస్తడు. ప్రభుత్వాలను ఎలా కూల్చాలని ప్రతి నిమిషం మీరు ఆలోచిస్తారు. అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలని, ఎన్నికల్లో ఎలా గెలువాలని ఆలోచిస్తారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెడుతున్నాం. ప్రజలకు కావాల్సింది చేస్తూ పోయాం. మీలాగా ఆపద మొక్కులు మొక్కలేదని హరీశ్రావు స్పష్టం చేశారు.