సిద్దిపేట: సిద్దిపేటకు (Siddipet) వీలైనంత తొందర్లో రైలు (Train) కూత వినిపించాలని, యుద్ధప్రాతిపదికన ట్రాక్ (Railway track) నిర్మాణ పనులను పూర్తిచేయాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) రైల్వే అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు. రైల్వే ట్రాక్ పనుల్లో జాప్యం జరుగొద్దని, పనుల వేగం పెంచాలని సూచించారు. సిద్దిపేట శివారులోని మందపల్లి (Mandapally) నుంచి రైల్వేట్రాక్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సంతోశ్ కుమార్తో కలిసి మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు చేపట్టిన ట్రాక్ నిర్మాణ పనులు గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మందపల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ జాప్యంపై మంత్రి హరీశ్ రావు ఆరా తీశారు. పనులు జరుగుతున్న తీరును తెలుసుకుని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.