Minister Harish rao | భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో బీఆర్ఎస్ శని పోయిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి శకుని పాత్రలు, వెన్నుపోటు పొడిచేవారు వెళ్లిపోయారని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో బీఆర్ఎస్కు ఒక్క స్థానం వచ్చి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు చేజారాయని, ఈసారి తొమ్మిది స్థానాలు గెలుస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. పొంగులేటిని ఆర్థిక అరాచకవాదిగా అభివర్ణించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఇప్పుడు కొత్తగా ఆయనలో ఏమి కనిపించిందో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉంటే.. వాటిని ప్రజలకు వివరించాలని రాహుల్గాంధీకి మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, పంటలకు ఉచిత విద్యుత్తు వంటి పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. రాహుల్గాంధీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ ఇక్కడి నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్నే చదువుతున్నారని, నిజాలు మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఖమ్మం జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయించలేదని, సీఎం కేసీఆర్ రెండు మెడికల్ కాలేజీలు ఇచ్చారని వివరించారు. విభజన చట్ట హామీలను బీజేపీ తుంగలో తొక్కితే రాహుల్గాంధీ పార్లమెంట్లో నోరు విప్పలేదని ధ్వజమెత్తారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినా, సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును ఆంధ్రాకు అప్పగించినా కాంగ్రెస్ నాయకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల మధ్యకు వస్తుందని, బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటుందని చెప్పారు. ఖమ్మం జిల్లాలో మళ్లీ కాంగ్రెస్ దొంగలు పడుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఎద్దేవాచేశారు. ప్రజలు అప్రమత్తమై అలాంటి నాయకుల నుంచి జిల్లాను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు రాములునాయక్, హరిప్రియనాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఖమ్మం నగర మేయర్ నీరజ, నగరపాలక సంస్థ చైర్మన్ ఆదర్శ్ సురభి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
భీం స్ఫూర్తితోనే పోడు పట్టాలు
గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీం స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి పోడు భూములకు పట్టాల పంపిణీని ప్రారంభించారు. తొమ్మిదేండ్లలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. 50 ఏండ్లలో పరిష్కారం కాని పోడు భూముల సమస్యను పరిష్కరించారు.
– అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి
పండుగలా పట్టాల పంపిణీ
తెలంగాణలో చారిత్రాత్మకంగా పట్టాల పంపిణీ రోజును గిరిజనులు పండుగలా జరుపుకొంటున్నారు. మహబూబాబాద్లో 67,730 ఎకరాలకు 25 వేల మందికిపైగా లబ్ధిదారులు ఉన్నారు. అటవీ భూములనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పోడు రైతులకు సీఎం కేసీఆర్ హక్కు పత్రాలు అందించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం.
– సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
కేసీఆర్ కృషి ఫలితమే పోడు పట్టాలు
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే గిరిజన రైతులకు పోడు పట్టాలు అందుతున్నాయి. మానుకోట ప్రజలు బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రుణం తీర్చుకోవాలి. 67 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, తొమ్మిదేండ్లుగా కేంద్రంలో పాలిస్తున్న బీజేపీలు తెలంగాణకు చేసిందేమీ లేదు. గ్రామాల్లో కాంగ్రెస్, బీజేపీ చేసే విషప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలి.
– ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
హామీ నెరవేర్చిన ఘనత కేసీఆర్దే
ఇదే ఎన్టీఆర్ స్టేడియంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోడు రైతులకు పట్టాలందిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే నేడు పట్టాలు అందించి ఆచరణ సాధ్యం చేశారు. పట్టాలు, రైతుబంధుతో గిరిజనులకు డబుల్ కానుక ఇచ్చారు. 75 ఏండ్లలో సాధ్యం కాని అభివృద్ధి కేవలం తొమ్మిదేండ్లలోనే చేసి చూపించిన ఘనుడు సీఎం కేసీఆర్.
– మాలోత్ కవిత, మహబూబాబాద్ ఎంపీ
కేసీఆర్ గిరిజనుల పాలిట దేవుడు
రాష్ట్రంలో 6 శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్ 10 శాతానికి పెంచి గిరిజనుల పాలిట దేవుడిగా నిలిచారు సీఎం కేసీఆర్. పోడు పట్టాలు పంపిణీ చేయడం ఈ ప్రాంత గిరిజన రైతుల అదృష్టం. ఇది సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే సాధ్యమైంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో మానుకోట అభివృద్ధి చెందుతున్నది.
– శంకర్ నాయక్, ఎమ్మెల్యే, మహబూబాబాద్
గిరిజనుల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
పోడు అంటేనే గిరిజన ప్రాంతంలో జఠిలమైన సమస్య. కొన్నిసార్లు పోడుపై ఏజెన్సీలో యుద్ధవాతావరణం నెలకొనేది. ఈ సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుందోనని నేను ఎంతో ఆందోళన చెందాను. సీఎం కేసీఆర్ గిరిజనులకు పట్టాలు ఇచ్చి మా భయాలన్నింటినీ తొలగించారు.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే
రాష్ట్రంలో 4.06 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు
జల్, జంగిల్, జమీన్ పేరిట గిరిజనుల త్యాగాలను సీఎం కేసీఆర్ గుర్తించారు. గిరిపుత్రులు ఎన్నో ఏండ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూములకు ఈ రోజు ఇక్కడి నుంచే పట్టాల పంపిణీని ప్రారంభించుకోవడం చారిత్రాత్మక ఘట్టం. రాష్ట్రంలో 4,06,369 ఎకరాలకు పట్టాలతోపాటు రైతుబంధు పథకం డబ్బులు సైతం పంపిణీ చేస్తాం.
– శాంతికుమారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
దశాబ్దాల కల నెరవేరింది
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పోడు భూములకు పట్టాలు రావడంతో మా కల నెరవేరింది. మంత్రి కేటీఆర్ సార్ చేతుల మీదుగా పట్టా తీసుకోవడం ఆనందం కలిగించింది. పోడు సమస్యకు పరిష్కారం చూపి పట్టా పాసు పుస్తకాల ఇస్తున్న కేసీఆర్ మేలును గిరిపుత్రులు ఎన్నడూ మర్చిపోరు.
– బానోత్ రాధ, పాటిమీది తండా, సర్పంచ్, మహబూబాబాద్ జిల్లా