హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉర్దూ అకాడమీకి చెందిన కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థకు 30 ఏండ్లపాటు లీజుకు అప్పగించేందుకు జారీ చేసిన జీవో-20ని వెంటనే రద్దు చేయాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం దర్గా హుస్సేన్ షావలీలోని సర్వే నంబర్-29లో ఉన్న 1.04 ఎకరాల (5,220 చదరపు గజాలు) ఉర్దూ అకాడమీ భూమిని హైదరాబాద్కు చెందిన ఎన్ఎన్ ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్స్కు 30 ఏండ్లపాటు లీజుకు అప్పగించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
ఈ భూమిలో ఉర్దూ ఘర్, షాదీఖానా, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ, కోట్ల విలువైన భూమిని కేవలం వార్షిక లీజు రుసుము రూ.5,220కే ప్రైవేట్ సంస్థకు కేటాయించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. పబ్లిక్ నోటీసు జారీచేయకుండా, టెండర్లు ఆహ్వానించకుండా లీజు మంజూరు ఉత్తర్వుల వెనుక మతలబేంటీ? అని ప్రశ్నించారు. జీవోను ఉపసంహరించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని యాకూబ్ పాషా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఉర్దూ అకాడమీ భూములను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ జారీ చేసిన జీవో-20ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వక్ఫ్ బోర్డు మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ మాజీ కార్యదర్శి అల్హాజ్ మౌల్వీ వహీద్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఆధ్వర్యంలో సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మైనారిటీ వెల్ఫేర్ శాఖ కార్యదర్శికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వహీద్ అహ్మద్ మాట్లాడుతూ.. ఎలాంటి టెండర్ ప్రక్రియ, పబ్లిక్ నోటీసు లేకుండా లీజు ఇవ్వడమేంటి? అని ప్రశ్నించారు.