హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తల్లులను కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షణ వలయం ఏర్పాటు చేశారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి పెండ్లి అయ్యేవరకూ కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మాతృ మరణాల కట్టడిలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు. ఆదివారం ఆయన ట్విట్టర్ వేదికగా మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచంలో తల్లిని మించిన యోధులు మరెవ్వరూ లేరని, అలాంటి తల్లిని సంరక్షించుకునేందుకు సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు తెలంగాణ సరారు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. బిడ్డ కడుపులో పడగానే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్, బాలింతలు, గర్భిణులకు పౌష్ఠికాహారం అందించేందుకు ఆరోగ్యలక్ష్మి, ఆరోగ్య సమస్యలు ముందుగానే గుర్తించి సత్వర చికిత్స అందించేందుకు అరోగ్య మహిళ, వ్యాధి నిరోధకత పెంచేలా 100 శాతం టీకాల కార్యక్రమం, ఇంటి నుంచి దవాఖానకు, దవాఖాన నుంచి ఇంటికి ఉచిత ప్రయాణ సేవలకు అమ్మ ఒడి వాహనాలు, రాష్ట్రవ్యాప్తంగా 28 మాతా శిశు సంరక్షణ కేంద్రాలు.. ఇవన్నీ తల్లులు, ఆడబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన రక్షణ వలయమని హరీశ్రావు వివరించారు.
మాతృమరణాలను తగ్గించడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. 2014లో మాతృమరణాల రేటు 92 ఉండగా, ప్రస్తుతం 43కు తగ్గిందని, ఇది తల్లులు, ఆడబిడ్డల సంరక్షణ పట్ల కేసీఆర్కి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు.