సిద్దిపేట : జిల్లా పర్యటనలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.
మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ను ప్రారంభించి డబుల్ బెడ్ రూమ్ గృహ ప్రవేశాల కార్యమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. గ్రామస్తులకు బతుకమ్మ-దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
చిన్నకోడూర్ మండలంలోని 73 మహిళా గ్రూపులకు ఒక్కొక్కరికి 10 వేల చొప్పున రూ.7 లక్షలు పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యాసంగిలో వెనుకమడి ఎండేదని, కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక చెక్ డ్యాములు నిండి పక్కా రెండు పంటలు పండుతున్నాయని వెల్లడించారు.
బీజేపీ ప్రభుత్వం రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200 చేశారని, సబ్సిడీ మాత్రం ఎగ్గొట్టారని మంత్రి ఆరోపించారు. యేటా రెండు కోట్ల ఉద్యోగాలు రాలేదు. జన్ ధన్ బ్యాంకు ఖాతాలలో డబ్బులు పడ్డది సున్నా అని ఎద్దేవా చేశారు.
చైనా, పాకిస్తాన్ దేశాలలో కరువు వచ్చి తెలంగాణ బియ్యంకు డిమాండ్ పెరగడంతో.. కేంద్రం 20 శాతం సుంకం విధించిందని మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల బాయికాడ విద్యుత్ మీటర్లు పెడితే రూ.35 వేల కోట్ల ఇస్తామంటే వద్దంటే వద్దని.. రైతు శ్రేయస్సు ముఖ్యమని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారని మంత్రి గుర్తు చేశారు.