నారాయణపేట : అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరసలో నిలబెట్టామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. బుధవారం మక్తల్లో రూ.34 కోట్లతో 150 పడకల దవాఖాన, అగ్నిమాపక కేంద్రం ప్రారంభం, రూ.156 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,(Primary Health Centre) రూ.72 లక్షలతో మార్కెట్ కమిటీ కార్యాలయం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలలో ముందుకు పోతున్నదని తెలిపారు. ప్రస్తుతం వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందేలా సర్కార్ దవాఖానాలు ఏర్పాటు చేసి, ప్రజల ఆరోగ్యం కాపాడుతున్నట్లు పేర్కొన్నారు. ఆనాడు తాగడానికే నీరు లేని పరిస్థితి కాగా నేడు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కృషి చేసినట్లు చెప్పారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు బీమా, రైతుబంధు 24 గంటల ఉచిత విద్యుత్ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఇటీవల రైతులకు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. అనంతరం బీసీ బంధు కింద రూ.లక్ష చెక్కులను, దళిత బంధు, మైనారిటీలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రజనీ సాయిచంద్, జడ్పీ చైర్మన్ వనజ ఆంజనేయులు, నిజాం పాషా, శ్రీనివాస గుప్తా, శ్రీధర్ గౌడ్, సుచరిత రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.