కలలోనైనా 24 గం. కరెంటు వస్తదనుకున్నమా.. వచ్చింది
కలలోనైనా కాళేశ్వరం వస్తదనుకున్నమా.. వచ్చింది
కలలోనైనా రైతుబంధు వస్తదనుకున్నమా.. వచ్చింది
కలలోనైనా కల్యాణలక్ష్మి వస్తదనుకున్నమా.. వచ్చింది
కలలో కూడా కననివన్నీ తెచ్చిండు కేసీఆర్
రానేరాదనుకున్న తెలంగాణ తెచ్చిండు కేసీఆర్
కానేకాదనుకున్న కాళేశ్వరం కట్టిండు కేసీఆర్
ఇప్పుడు ప్రతి గుంటకు నీళ్లు.. ప్రతి గుండెలో కేసీఆర్
– మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట ప్రతినిధి, మార్చి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అల్లావుద్దీన్ అద్భుత దీపమేమీ లేదని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆ వెలుగును ఇచ్చారని, ఆయనే అద్భుత దీపం అని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. కష్టపడి మెదడు కరగదీసి రైతుల కోసం కరెంటు బాగుచేశారని, చెరువులు బాగు చేశారని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పెద్దవాగుపై పెద్దోళ్ల బావి వద్ద నిర్మించిన చెక్డ్యాం కాళేశ్వరం జలాలతో తొలిసారి నిండటంతో ఆయన బుధవారం గంగమ్మ తల్లికి, నల్ల పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. ‘60 ఏండ్లలో రాని తెలంగాణ.. గిప్పుడు వస్తదా అని పక్క జిల్లాల్లో, పక్క రాష్ర్టాల్లో మాట్లాడుకున్నరు. కానీ, కొట్లాడిండు.. మన తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. తెలంగాణ రాకముందు ఎట్లుండే, వచ్చినంక ఎట్లున్నది? నీళ్లు, కరెంటు, రోడ్లు.. ఇలా ఏ రంగం చూసినా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటున్నది. నాడు కరెంటు అంటే టెన్షన్, కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త. కేసీఆర్ కడుపు నిండా కరెంటు ఇచ్చిండు. టైం మీద ఎరువులు ఇచ్చిండు. పెట్టుబడికి పది వేల రూపాయలు ఇచ్చిండు. చెరువులు బాగు చేసిండు. కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు. పండిన ప్రతి గింజకు కాంటా పెట్టిండు. గందుకోసమే.. ఇయ్యాల రైతులు మంచిగున్నరు’ అని అన్నారు. ఇప్పుడు ఎటుచూసినా డబుల్ రోడ్లే కనిపిస్తున్నాయని చెప్పారు. ‘రోడ్లు మంచిగైనయ్, నీళ్లు మంచిగొచ్చినయ్, కరెంటు మంచిగొచ్చింది, గుళ్లు బాగుచేసుకున్నం, గోపురాలు కట్టుకున్నం, ఆసరా పెన్షన్ తెచ్చుకున్నం, కల్యాణలక్ష్మి తెచ్చుకున్నం, దవాఖానలు బాగుచేసుకున్నం, కేసీఆర్ కిట్ తెచ్చుకొని అందరికీ ఆదర్శంగా నిలిచినం. ఇవన్నీ కండ్ల ముందున్న నిజాలు’ అని వివరించారు.
నాడు రైతులు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి ఉండేదని, నేడు తెలంగాణ రైతులు దేశానికి అన్నం పెడుతున్నారని మంత్రి హరీశ్ తెలిపారు. ‘ఇప్పుడు ఊరూరా ధాన్యం కాంటా.. ఇక రైతులకు లేదు తంటా. ప్రతి ఊరిలో కాంటా పెట్టి చివరి గింజ కొనుగోలు చేసి 3, 4 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. నాడు పొద్దంతా నడిచే పెద్ద బోర్లు ఎండిపోతే.. నేడు బాయిలు, బోర్ల నుంచి నీరు బయటకు వస్తున్నది. స్వరాష్ట్రంలో చేదబావిలో నీళ్లు తోడుకునే రోజులు వస్తాయని ఉద్యమ సమయంలో చెప్పాం.. అదిప్పుడు రుజువైంది. ఇది తెలంగాణ సాధించిన అద్భుత విజయం’ అని వెల్లడించారు. 15 ఏండ్లు కష్టపడి కౌడాయపల్లి ఫీడర్ చానల్ కడితే చుక్క నీళ్లు రాలేదని.. తెలంగాణ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యాక చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయని వివరించారు.
సమాజంలోని ఏ వర్గానికైనా బీజేపీ ఒక్క మంచి పనిచేసిందా? అని మంత్రి హరీశ్రావు సూటిగా ప్రశ్నించారు. ‘ఎంతసేపు సమాధులు తవ్వుడు.. కూలగొట్టుడు.. రెచ్చగొట్టుడు తప్ప ఏ ఒక్క మంచి పని చేయలేదు. వాళ్లు సమాధులు తవ్వాలంటే.. మన కేసీఆర్ తెలంగాణకు బలమైన పునాదులు వేసే ప్రయత్నంలో ఉన్నారు’ అని తెలిపారు. ఇక ఇప్పుడు ఆన్లైన్ యూపీఐలపైనా పన్ను వేస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంటున్నదని, ఆ పార్టీ గరీబోల్ల దగ్గర గుంజి అంబానీ, ఆదానీలకు దోచిపెడుతున్నదని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అదానీ అమ్దానీ పెంచే ప్రయత్నం చేస్తున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతల ఆమ్దానీ పెంచే ప్రయత్నం చేస్తున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు, ఎరువుల కొరతలు, కాలిపోయే మోటర్లు అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే కేసీఆర్ అనేలా సిద్దిపేట పేరును ఆకాశన్నంత ఎత్తులో కేసీఆర్ నిలిపారని మంత్రి హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ మన కుటుంబమని, కన్న తల్లి లాంటి పార్టీ అని, అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఇప్పుడు మన పార్టీ జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నదని, కేసీఆర్కు మరింత శక్తినిచ్చి జాతీయ స్థాయిలో విస్తరించేలా పని చేద్దామని అన్నారు. నాడు ఉద్యమంలో తెలంగాణ అంతటా తిరిగి పని చేశామని, రాబోయే రోజుల్లో దేశంలో ఎక్కడికైనా వెళ్లి పని చేసేలా సిద్ధపడాలని చెప్పారు. సిద్దిపేట మట్టి బిడ్డ కేసీఆర్ అని.. కేసీఆర్ ఎంత ఎదిగితే మనకు అంత లాభం అని వెల్లడించారు. సభ అనంతరం కార్యకర్తలకు మంత్రి హరీశ్రావు స్వయంగా భోజనాలను వడ్డించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణ శర్మ, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.