డిసెంబర్ 19, 2018లో నీతి అయోగ్ స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా 75 పేరుతో 2022 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏవీ నెరవేరలేదు. కార్మికుల్లో మహిళల శాతం 30కి పెంచాలన్న లక్ష్యంలో ఫెయిల్.
తయారీ రంగంలో వృద్ధి రేటును డుబుల్ చేయాలన్న లక్ష్యంలో ఫెయిల్.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న లక్ష్యంలో ఫెయిల్.
పేదలందరికీ పక్కా ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంలో ఫెయిల్.
ప్రతి ఇంటికి నల్లా నీటిని అందిస్తామన్న లక్ష్యంలో ఫెయిల్..
-మీడియా సమావేశంలో మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): స్వతంత్రంగా ఉండాల్సిన నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వంతపాడుతూ రాజకీయ రంగు పులుముకున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. నీతి ఆయోగ్ ప్రకటన ఆర్ధసత్యాలతో విషయాన్ని పక్కదోవ పట్టించేలా ఉన్నదని ఆరోపించారు. రాజకీయ ప్రకటనలతో నీతి ఆయోగ్ తన విలువ తగ్గించుకొన్నదని, సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పలేదని అన్నారు. కేంద్రం ప్రకటించిన విధంగా రాష్ట్రాలకు నిధుల బదలాయింపు 42 శాతం జరగడంలేదని, 29.60 శాతం మాత్రమే జరుగుతున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం తన వాటాను తగ్గించుకొని సెస్సులను 20 శాతానికి పెంచి రూ.21 లక్షల కోట్లు వసూలు చేసి రాష్ట్రాల వాటా రాకుండా చేసిందని ధ్వజమెత్తారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రులు మహమూద్ అలీ, గంగుల కమలాకర్, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. నీతి ఆయోగ్తోపాటు ఆర్థిక సంఘం సిఫారసులను కూడా కేంద్రం పట్టించుకోలేదని, ప్రగతిపథంలో ఉన్న రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన కేంద్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
నిధులే ఇయ్యలేదు.. ఎలా వినియోగిస్తారు?
జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి రూ.3,982 కోట్లు కేటాయిస్తే రూ.200 కోట్లు మాత్రమే తెలంగాణ వాడుకొన్నదని నీతి ఆయోగ్ చేసిన ప్రకటన పూర్తిగా అబద్ధమని మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. వాస్తవంగా ఆ నిధుల కోసం కేంద్రానికి అనేకసార్లు లేఖలు రాసినా స్పందించలేదని ఆరోపించారు. నిధుల విడుదల కోసం 2019 సెప్టెంబర్ 26న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, 2020 మార్చిలో గ్రామీ ణ మంచినీటి సరఫరా శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్, 2020 అక్టోబర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, 2022 ఏప్రిల్లో మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి లేఖ రాశారని గుర్తుచేశారు. ఇన్నిసార్లు లేఖలు రాసినా కేంద్రం నిధులు విడుదల చేయలేదని మండిపడ్డారు. 2016లో మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చేసిన సిఫారసును కేంద్రం బుట్టదాఖలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రాల హకులు హరించేలా మోదీ సర్కారు వ్యవహరిస్తుంటే సహకార సమాఖ్య స్ఫూర్తి ఎక్కడున్నదని ప్రశ్నించారు.
కేంద్రం లెక్కలన్నీ మోసం
పీఎంకేఎస్వై కింద రూ.1,195 కోట్లు ఇచ్చామని నీతి ఆయోగ్ చెప్తున్నదని, దానికి మిషన్ కాకతీయకు ఏమైనా సంబంధం ఉన్నదా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. రాష్ట్రాలకు నిధులు పెంచామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు పూర్తిగా మోసపూరితమైనవని విమర్శించారు. రాష్ర్టాలకు నిధుల బదలాయింపు 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని చెప్తున్న మాటలన్నీ ఉత్తవేనని 15వ ఆర్థిక సంఘం, కాగ్ స్వయంగా వెల్లడించాయని గుర్తుచేశారు. రాష్ట్రాలకు 29.6 శాతం మాత్రమే నిధులను బదలాయిస్తున్నారని, మాటల్లో మాత్రం వాటా పెంచామని చెప్పుకొంటున్నారని విమర్శించారు. సెస్సుల పేరుతో రాష్ట్రాలకు నిధులు ఎగ్గొడుతున్నారని ధ్వజమెత్తారు. సెస్సులో గతంలో 10 శాతం ఉంటే ఇప్పుడు 20 శాతానికి పెంచారని, దీంతో రాష్ట్రాలకు ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఏడు సంవత్సరాల్లో సెస్సుల రూపంలో రూ.15,47,560 కోట్లు సమకూర్చుకొన్నదని, ఈ ఏడాది వసూలు చేసిన రూ.5,35,112 కోట్లు కలిపితే రూ. 21లక్షల కోట్లు అవుతుందని చెప్పారు. వాటా ప్రకారం సెస్సుల నుంచి రాష్ర్టాలకు రూ.8,60,000 కోట్లు హకుగా రావాలని, ఇందులో తెలంగాణకు రావాల్సిన రూ.42 వేల కోట్లు రాకుండా పోయాయని వెల్లడించారు. వీటి గురించి నీతి అయోగ్ ఎందుకు మాట్లాడటంలేదని నిలదీశారు. నీతి ఆయోగ్ చెప్పే సహకార సమాఖ్య స్ఫూర్తి ఇదేనా? అని ప్రశ్నించారు.
లక్ష్యాలన్నింటిలోనూ ఫెయిల్..
డిసెంబర్ 19, 2018లో నీతి అయోగ్ స్ట్రాట జీ ఫర్ న్యూ ఇండియా -75 పేరుతో 2022 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏవీ నెరవేరలేదని మంత్రి హరీశ్రావు విమర్శించారు. ‘కార్మికుల్లో మహిళల శాతం 30కి పెంచాలన్న లక్ష్యం లో ఫెయిల్. తయారీ రంగంలో వృద్ధి రేటును డుబుల్ చేయాలన్న లక్ష్యంలో ఫెయిల్. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న లక్ష్యంలో ఫెయిల్. పేదలందరికీ పక్కా ఇండ్లు నిర్మించాలన్న లక్ష్యంలో ఫెయిల్. ప్రతి ఇంటికి నల్లా నీటిని అం దిస్తామన్న లక్ష్యంలో ఫెయిల్.. ఇలా నీతి ఆయో గ్, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకొన్న ఏ లక్ష్యాన్నీ సాధించలేకపోయాయి. కానీ తెలంగాణలో 100 శాతం ఇంటింటికి నల్లా నీటిని అందిస్తున్నాం. 24 గంటల కరెంట్ అందిస్తున్నాం’ అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు రాజకీయాలు చేయకుండా వాస్తవాలు చెప్పాలని చురకలంటించారు.