సంగారెడ్డి, ఏప్రిల్18(నమస్తే తెలంగాణ): జాతీయస్థాయిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపీ నేతలను నిరుద్యోగ యువత నిలదీయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖాళీలను భర్తీ చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో 16.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైల్వేలో 3 లక్షలు, ఆర్మ్డ్ ఫోర్సుల్లో 3 లక్షలు, ఎల్ఐసీలో 50 వేలు ఇలా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు. కేంద్రం ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే తెలంగాణకు చెందిన లక్ష మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కేంద్రం చర్యలతో దేశంలో నిరుద్యోగం సమస్య పెరుగుతున్నదని పేర్కొన్నారు.
ఉపాధి కల్పన దిశగా కేంద్రం ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ పాదయాత్రలు చేస్తున్న బీజేపీ నేతలకు ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీశ్రావు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పోలీసు కోచింగ్ కేంద్రాలను ప్రారంభించారు. దళితబంధు పథకం లబ్ధిదారులకు వాహనాలు, మంజూరుపత్రాలు అందజేశారు. మన ఊరు-మన బడి పథకాన్ని ప్రారంభించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బతుకలేక.. ఉపాధి అవకాశాలు రాక.. ఉత్తరాది ప్రజలు తెలంగాణకు పెద్ద సంఖ్యలో వలసవస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలివ్వక.. ధాన్యం సేకరణలో మోసం చేసి.. అన్ని విధాలా తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని డిమాండ్చేశారు.
ధాన్యం కొనుగోలుతో 4700 కోట్ల భారం
తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేసినప్పటికీ.. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని యాసంగిలో ధాన్యం కొనుగోలుకు నిర్ణయం తీసుకొన్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 4,700 కోట్లు అదనపు భారం పడుతుందని చెప్పారు. యాసంగి సీజన్లో తెలంగాణలో అత్యధికంగా 36 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేసినట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 11 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు అయిందని చెప్పారు. తెలంగాణలోని వరి సాగుచేసిన రైతులు ఇబ్బందిపడవద్దని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
విప్లవాత్మకం.. మన ఊరు.. మనబడి
మన ఊరు, మనబడి కార్యక్రమం విప్లవాత్మకమైన నిర్ణయంగా మంత్రి హరీశ్రావు చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలుగా మారుతాయని చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లంలో బోధన ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యార్థులకు సులువుగా ఇంగ్లిష్ అర్థమయ్యేందుకు పుస్తకాల్లోని ఒకే పాఠ్యాంశాన్ని తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ముద్రిస్తున్నట్టు వివరించారు. మన ఊరు మనబడి కార్యక్రమానికి బడ్జెట్లో రూ.7,300 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. కాలేజీలు, పాఠశాలల్లోని విద్యార్థినులకు హైజీన్క్ కిట్లు అందజేసేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో కేసీఆర్ ఏ మంచి పనిచేసినా ప్రతిపక్షాలు అశుభం పలుకుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. గత పాలకుల్లా తాము ఏసీ రూముల్లో కూర్చోకుండా 45 డిగ్రీల ఎండలో సైతం ప్రజల్లో ఉంటూ వారికోసం పనిచేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, గూడెం మహిపాల్రెడ్డి, మాణిక్రావు, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ హన్మంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా తదితరులు పాల్గొన్నారు.
దళితబంధును దేశమంతా అమలుచేయాలె
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలను కాపీ కొడుతున్న మోదీ ప్రభుత్వం.. దమ్ముంటే దళితబంధు పథకాన్నికూడా కాపీకొట్టి దేశవ్యాప్తంగా అమలుచేయాలని మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. దళితబంధు పథకం అమలుచేస్తుంటే, కాంగ్రెస్, బీజేపీ ఓర్వడం లేదన్నారు. 40 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, దళితులను కేవలం ఓటు బ్యాంకుగా చూసిందే తప్ప, వారిని పైకి తీసుకురాలేదని విమర్శించారు. బీజేపీ కూడా ఇదేరకంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని పారదర్శకంగా అమలుచేస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు దళితులపై ప్రేమ ఉంటే తాము పాలిస్తున్న రాష్ర్టాల్లో దళిత బంధు పథకం అమలుచేయించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి కేటాయిస్తున్న నిధులను తాము కేవలం దళితబంధు పథకానికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. దళితబంధు పథకం కోసం బడ్జెట్లో రూ.17,800 కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు.
హన్వాడలో దళితుడికి బొలెరో అందజేసిన మంత్రి
హన్వాడ, ఏప్రిల్ 18: దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో దళితబంధు పథకం ద్వారా మంజూరైన బొలెరో వాహనాన్ని లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు దళితులను పట్టించుకోకపోవడంతో వారు అన్ని విధాలుగా వెనుకబడ్డారని, వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకొన్నారని గుర్తుచేశారు. మండలంలో 35 మందికి దళితబంధు మంజూరైందని తెలిపారు.