Minister Harish Rao | ప్రతిపక్షాలు ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలకు అభివృద్ధి అనే ఆయుధంతో సమాధానం చెబుతున్నామని వ్యాఖ్యానించారు. నల్గగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. అభివృద్ధి చేసి చూపిస్తున్నాం కాబట్టే అవార్డులు మన సొంతమయ్యాయని తెలిపారు.
కేసీఆర్ పాలనను చేసి యావత్ దేశమే గర్విస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ తప్ప మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలు వెనుకబడ్డాయని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు చేసే విష ప్రచారాలకు.. బీఆర్ఎస్ కార్యకర్తలు విషయ పరిజ్ఞానంతో బుద్ధి చెప్పాలని సూచించారు. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ఆరు వేల ఉద్యోగాలు ఇస్తే.. బీఆర్ఎస్ పాలనలో 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగం లేదని.. కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన బాగోలేదు కాబట్టే కేసీఆర్ను రెండుసార్లు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని అన్నారు. మళ్లీ రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరని అన్నారు.