Minister Harish Rao | తెలంగాణకు ఏమీ చేయలేదని ఉత్సవాలు చేస్తారా? అంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డిని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సమీక్ష మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 21 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయన్నారు. అమరుల త్యాగాలను, తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ 2 తెలంగాణకు స్వాతంత్య్ర దినంలాంటిదన్నారు.
సమైక్య రాష్ట్రంలో పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాలు వెనుకబడే ఉన్నాయని, నేడు తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదని, అన్నివర్గాలు ప్రతిపథంలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు దశాబ్ది ఉత్సవాలు మింగుడుపడడం లేదని, ఉద్యమంలో నాడు రెండు పార్టీలు కలిసి రాలేదని ఆరోపించారు. నేడు ఉత్సవాలకు రావడం లేదని, అమరుల త్యాగాలను కాంగ్రెస్ తక్కువ చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ ప్రత్యేకంగా ఉత్సవాలు చేస్తుందని కిషన్రెడ్డి చెబుతున్నారని, ఉద్యమంలో రాజీనామా చేయమంటే భయపడ్డారన్నారు. తెలంగాణకు కేంద్రం ఏం చేయలేదని ఉత్సవాలు చేస్తారా?.. ఉత్సవాలు జరిపే నైతికత బీజేపీకి ఉందా? అని నిలదీశారు.
ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ సిఫారసులు చేసినా కేంద్రం ఏనాడు పట్టించుకోలేదని, విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు. కృష్ణా జలాల వాటా తేల్చరని, స్వయంగా సీఎం కేసీఆర్ లేఖలు రాసినా స్పందన లేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.1,350 కోట్ల బకాయిలు ఇవ్వడం లేదని, కేంద్రానికి నచ్చిన రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నారని, కానీ ప్రశ్నించిన రాష్ట్రాలకు మాత్రం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర అవతరణను వ్యతిరేకించడం అంటే అమరులను అవమానించడమేనన్నారు. నీతి ఆయోగ్కు ఇజ్జత్ ఉందా..? అన్న ఆయన.. కేంద్రం ఏనాడైనా విలువ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మోదీ గారిలో ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతిందని, నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు రూ.20వేలకోట్లు ఇవ్వాలని చెబితే.. కనీసం 20 పైసలు ఇవ్వలేదని, నీతి ఆయోగ్ సమావేశాలకు గతంలో ఎన్నో సార్లు కేసీఆర్ హాజరయ్యారన్నారు.
రాష్ట్ర అప్పుల గురించి కాదని, కేంద్రం చేసిన అప్పుల సంగతి ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం పరిమితికి లోబడి అప్పులు చేశామని, కేంద్రం ఎప్పుడో పరిమితి దాటిందన్నారు. పార్లమెంట్కు అంబేద్కర్ పెరు పెట్టుమంటే ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రపతి, గవర్నర్ వ్యవస్థలకు తేడా తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలన్నారు. మోదీ చెప్పేవన్నీ టీమ్ ఇండియా చేసేవి మాత్రం తోడో ఇండియా అంటూ విమర్శించారు.