హైదరాబాద్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగి కాలిని ఎలుక కొరికేసిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సీరియస్గా స్పందించారు. ఈ ఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఆ రోగి చికిత్స పొందుతున్న వార్డును అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. సాయంత్రం లోగా నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
వరంగల్లోని భీమారానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో గత శనివారం ఎంజీఎంలో చేరాడు. ఆదివారం(మార్చి 27) తెల్లవారుజామున శ్రీనివాస్ కాలి వేలును ఎలుక కొరికేసింది. ఈ ఘటనను వైద్యుల దృష్టికి తీసుకెళ్లగా, అతనికి చికిత్స అందించారు.
గురువారం ఉదయం మరోసారి శ్రీనివాస్ కాళ్లను ఎలుకలు కొరికేశాయి. దీంతో తీవ్రంగా రక్తస్రావమైంది. అప్పటికే ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీనివాస్.. ఎలుకల దాడి కారణంగా మరింత అనారోగ్యానికి గురయ్యారు. బాధిత వ్యక్తికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ రావు స్పందించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోగుల బంధువులు బయటి నుంచి ఆహారం తీసుకొచ్చి బెడ్ల వద్ద పడేయడం వల్లే ఎలుకల బెడద ఎక్కువైందని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.