సంగారెడ్డి: వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్లు (Nutrition kit)అందించనున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ఒక్క విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలో ఎనిమిది మెడికల్ కాలేజీ, హాస్పిటళ్లను ప్రారంభించుకున్నామని చెప్పారు. ఎయిమ్స్లో (AIMS) కంటే తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో (Medical colleges) ఎక్కువ సౌకర్యాలు కల్పించామన్నారు. సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి (Sangareddy) ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొత్తగా ఏర్పాటుచేసిన ఈ-లైబ్రరీని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సంగారెడ్డి మెడికల్ కాలేజీని రికార్డ్ సమయంలో 7 నెలల్లోనే పూర్తిచేశామన్నారు.
తెలంగాణ రాకముందు 58 ఏండ్లలో మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఒక్క 2022 సంవత్సరంలోనే తాము 8 కాలేజీలను ఏర్పాటుచేశామన్నారు. తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్లలో 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి లక్షమందికి 19
ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అన్ని మెడికల్ కాలేజీల్లో లైబ్రరీలు, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. రూ.16.5 కోట్లతో రాష్ట్రంలో మూడు ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్లను ప్రారంభించుకున్నామన్నారు.
అంతకుముందు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో 58, 59 జీవో ప్రకారం లబ్ధిదారులకు మంత్రి హరీశ్ హక్కు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ధరణి (Dharani) పోర్టల్తో సులభంగా, వేగవంతంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా భూమి క్రయవిక్రయాలు చేయొచ్చన్నారు. పైసా ఖర్చులేకుండా ఇంటికే పట్టాదారు పాస్ పుస్తకాలు వస్తున్నాయని చెప్పారు. ధరణిపై అవగాహన లేకుండా కొందరు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ధరణితో అవినీతి తగ్గిందని, పారదర్శకత పెరిగిందని చెప్పారు. ధరణి పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. ధరణిని రద్దు చేయడమంటే లంచాలను మళ్లీ తేవడమేనని చెప్పారు.
ప్రజలు మిమ్మల్ని రద్దు చేస్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరితహారంలో (Haritha haram) భాగంగా కలెక్టరేట్ను పచ్చదనంతో నింపేశారని అభినందించారు. రాష్ట్రంలో 7 శాతం అడవులు పెరిగాయని వెల్లడించారు.