హైదరాబాద్: చనిపోయి కూడా జీవించడమనేది చాలా గొప్ప విషయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. అవయవదానం చేయాలనే నిర్ణయం గొప్పదన్నారు. దాతల నిర్ణయం ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు. అవయవదానంతో ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారని తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జీవన్దాన్ ఆధ్వర్యంలో అవయవదాతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. 2020 సంవత్సరంలో 85 కుటుంబాలు అవయవదానం చేశాయన్నారు. ఆప్తులను కోల్పోవడం ఎవరికైనా బాధాకరమే అని వెల్లడించారు.
బ్రెయిన్డెడ్ అయినవారి అవయవాలు దానం చేయడమే ఉత్తమమని మంత్రి అన్నారు. అవయవదానంతో నలుగురికి ప్రాణం పోయొచ్చని చెప్పారు. మరణం తర్వాతా నలుగురికి జీవితాన్ని ఇచ్చి కీర్తి పొందొచ్చన్నారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చారని, అలా ఇవ్వాలని తను బతికున్నప్పుడే చెప్పారని పేర్కొన్నారు. అవయవాలు నిరుపయోగంగా మట్టిలో కలిసిపోవద్దనేది వారి ఆశయమన్నారు. ఎవరికైనా ఉపయోగపడాలనే ఆలోచన చాలా గొప్పదని చెప్పారు.
అవయవాల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు. కొందరు రోగులు మూడు నాలుగేండ్లపాటు ఎదురుచూడాల్సి వస్తున్నదని వెల్లడించారు. కిడ్నీ బాధితుల బాధ చెప్పలేనిదని అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లోనూ అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నామన్నారు. అలాంటివారికి ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తున్నదని పేర్కొన్నారు.
అవయవదానంతో మరొకరికి పునర్జన్మనిచ్చిన దాతలు దేవుడితో సమానమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అవయవదానం చేసి అనేకపమంది ప్రాణాలను కాపాడిన దాతలను స్మరించుకోవాలని చెప్పారు. అవయవదానంతో 3800 మంది పునర్జన్మ పొందారని వెల్లడించారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదని, కానీ సీఎం కేసీఆర్ పాలనలో పరిస్థితి మారిపోయిందన్నారు. ప్రజలు గవర్నమెంట్ హాస్పిటళ్ల బాట పడుతున్నారని చెప్పారు.