సంగారెడ్డి: పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కేంద్ర సర్కార్ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం మోపిందన్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.వెయ్యి దాటడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంగారెడ్డి పట్టణంలో కొత్త పింఛనుదారులకు మంత్రి హరీశ్ రావు స్మార్టు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2016 పెన్షన్ ఇస్తున్నామన్నారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం రూ.600 మాత్రమే పింఛన్ ఇస్తున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో మొత్తం 40 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్లు అదిస్తున్నామని చెప్పారు. ఎవరూలేని వారికి పింఛను, బియ్యం భరోసా ఇస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా వివిధ వర్గాల వారికి పింఛన్లు ఇచ్చి సీఎం కేసీఆర్ అండగా ఉంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కోసం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు.
పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నారని వెల్లడించారు. సొంత జాగాలో ఇండ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని దసరా పండుగకు ప్రారంభిస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. రాబోయే వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.